న్యూఢిల్లీ: టెర్రర్ మాస్టర్ మైండ్ మసూద్ అజర్ ను అరెస్టు చేశామని, అనారోగ్యంతో బాధపడుతున్న అజర్కు జైల్లోనే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని పాక్చేసిన ప్రకటన అంతా నాటకమేనని తేలిపోయింది. అజర్ను అరెస్టు చేసినట్లే చేసి, రహస్యంగా విడుదల చేసినట్లు తమకు సమాచారం అందిందని ఇంటలిజెన్స్శాఖ ప్రకటించింది. అనారోగ్యానికి ట్రీట్మెంట్ తీసుకున్న అజర్.. చివరిసారిగా బహవల్పూర్లోని జైషే హెడ్క్వార్టర్స్లో కనిపించినట్లు ఐబీ పేర్కొంది. అనారోగ్యం నుంచి కోలుకున్నా అజర్ బయటికి రావడంలేదని తెలిపింది. ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా పాక్ సర్కారు భారీ కుట్రలు పన్నుతోందని, అందులో భాగంగానే అజర్ను విడుదల చేసి ఉండొచ్చని ఐబీ అధికారులు అనుమానిస్తున్నారు. తమ భూభాగంలో నుంచి కార్యకలాపాలు చేపడుతున్న టెర్రరిస్టు సంస్థలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ప్రపంచాన్ని నమ్మించేందుకు పాక్ సర్కారు ప్రకటనలు గుప్పిస్తోంది. పాక్ ప్రభుత్వం టెర్రరిస్టులకు ఆశ్రయమివ్వడంతో పాటు ట్రైనింగ్ ఇచ్చి ఆయుధాలు సమకూరుస్తుందన్న ఆరోపణలను ఇమ్రాన్ ఖాన్ తరచూ ఖండిస్తున్నారు.