- ఈ నెల9న శ్రీనగర్లో కానిస్టేబుల్ను కాల్చింది వీళ్లే
శ్రీనగర్: పోలీసుపై దాడి చేసిన ముగ్గురు హైబ్రీడ్ టెర్రరిస్టులను జమ్మూకాశ్మీర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ నెల 9న కానిస్టేబుల్ మహ్మద్ హఫీజ్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా శ్రీనగర్లోని బెమీనా ప్రాంతంలో దుండగులు కాల్పులు జరిపారు. మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరపగా కానిస్టేబుల్కు 3 బులెట్లు తగిలాయి. స్థానికులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
కుట్ర పన్నింది పాకిస్తాన్ టెర్రిస్టులే
పాకిస్తాన్కు చెందిన అర్జుమంద్ అలియాస్ హమ్జా బుర్హాన్ ఈ కుట్ర పన్నాడని కాశ్మీర్ డీజీపీ స్వైన్ మీడియాకు వెల్లడించారు. కాశ్మీర్ పోలీసులపై దాడి చేసేందుకు శ్రీనగర్కు చెందిన డానిష్ అహ్మద్ మల్లాను హమ్జా సంప్రదించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అతడు కానిస్టేబుల్ నివాసం ఉండే బెమీనా ప్రాంతానికి చెందిన ఇంతియాజ్ ఖండే, మోహనాన్ ఖాన్ను రిక్రూట్ చేసుకున్నాడని, ముగ్గురూ కలిసి పోలీసులను చంపేందుకు స్కెచ్ వేశారని వివరించారు. కొద్దిరోజుల ముందు నుంచీ ఇంతియాజ్, మోహనాన్ రెక్కీ నిర్వహించి కానిస్టేబుల్ను కాల్చారని చెప్పారు.
ప్రస్తుతం ఆ ముగ్గురినీ అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి లేటెస్ట్ వెర్షన్ పిస్టల్, 57 బులెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దాడికి కానిక్ టీపీ9 అనే మేడిన్ టర్కీ పిస్టల్ను ఉపయోగించారని, ఇది లైట్ వెయిట్తో కూడిన చాలా క్వాలిటీ కలిగిన వెపన్ అని వివరించారు. ఇలాంటి ఆయుధాలను బార్డర్ల నుంచి చిన్న డ్రోన్ల ద్వారా, ఇతర అనేక మార్గాల ద్వారా పాకిస్తాన్ టెర్రరిస్టులు మనదేశానికి అక్రమంగా చేరవేస్తున్నారని డీజీపీ వెల్లడించారు.