మంత్రి కోమటిరెడ్డితో జానారెడ్డి భేటీ

మంత్రి కోమటిరెడ్డితో జానారెడ్డి భేటీ

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి జానారెడ్డి, ఆయన కొడుకులు నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మినిస్టర్ క్వార్టర్స్​లో భేటీ అయ్యారు. నల్గొండ ఎంపీ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి బరిలోకి దిగుతున్నాడని, ఆశీర్వదించాల్సిందిగా వెంకట్ రెడ్డిని జానా రెడ్డి కోరారు. ఈ సందర్భంగా మూడు దశాబ్దాల రాజకీయ అనుబంధాన్ని ఇద్దరు గుర్తు చేసుకున్నారు.

రఘువీర్​కు తన సంపూర్ణ సహకారం ఉంటుందని, భారీ మెజార్టీతో గెలిపించుకుందామని వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్ స్కీమ్​లపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, గెలుపు ఖాయమన్నారు. జానారెడ్డి వెంట నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఉన్నారు. 

మంత్రి వెంకట్ రెడ్డితో డైరెక్టర్ రాఘవేంద్ర రావు భేటీ

సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్ర రావు, మా ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు, శివబాలాజీ కలిశారు. కళాకారులకు అవార్డులు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. సినీ రంగ పరిశ్రమలోని కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి సినిమా ఇండస్ట్రీకి పూర్తి సహకారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.