కోమళ్ల టోల్​ప్లాజా వద్ద రూ.కోటి 37 లక్షలు స్వాధీనం

కోమళ్ల టోల్​ప్లాజా వద్ద  రూ.కోటి 37 లక్షలు స్వాధీనం
  • బ్యాంకుకు తీసుకువెళ్తున్న సిబ్బంది
  • క్యూఆర్ ​కోడ్ లేకపోవడంతో స్వాధీనం
  • సూర్యాపేటలో 130 కిలోల వెండి సీజ్​

రఘునాథపల్లి, వెలుగు : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోమళ్ల టోల్ ప్లాజా వద్ద బుధవారం సాయంత్రం రూ. కోటి 37 లక్షల 50 వేలు నగదును రఘునాథపల్లి పోలీసులు సీజ్ చేశారు. శివునిపల్లి, తొర్రూర్ స్టేషన్ ఘనపూర్ ఎస్​బీఐ బ్యాంకుల నుంచి సీఎంఎస్ ​వాహనం ఇన్​చార్జి మురళీధర్ రెడ్డి, ఎస్కార్ట్ సిబ్బంది కలిసి నగదును జనగామ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్​కు తరలిస్తుండగా సరైన క్యూఆర్ కోడ్ లేకపోవడం, పేపర్లు చూపించకపోవడంతో వాహనంతో పాటు సీజ్ చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం బ్యాంకర్లు క్యూఆర్ కోడ్ తోనే నగదును తీసుకు వెళ్లాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు స్టేషన్ ఘనపూర్ ఏసీపీ శ్రీనివాస్ రావు , రఘునాథపల్లి రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై రఘుపతి, స్టేషన్ ఘనపూర్ ఎస్సై హరికృష్ణ ఉన్నారు.  

సూర్యాపేటలో...

సూర్యాపేట : సూర్యాపేటలో పేపర్లు లేకుండా నిల్వ ఉంచిన 130 కిలోల వెండి, రూ.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వెండి  విలువ రూ.కోటి పైగా ఉంటుందని అంచనా. రాజస్తాన్​కు చెందిన ఉత్తమ్ సింగ్ సూర్యాపేటలోని అలంకార్ రోడ్డులోని ఓ అద్దె ఇంట్లో ఉంటూ హోల్ సేల్ వెండి వ్యాపారం చేస్తున్నాడు. ఇతడి దగ్గర భారీగా వెండి ఉందన్న సమాచారంతో పోలీసులు, ఫ్లయింగ్ స్కాడ్​ బుధవారం తనిఖీలు చేయగా 130 కిలోల వెండి దొరికింది. దీనికి సంబంధించి ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసి కలెక్టరేట్ కు తరలించారు. తనిఖీల్లో ఎఫ్​సీటీ ఆఫీసర్ జగన్, వరుణ్, సీఐ నాగార్జున గౌడ్, ఎస్సై మహీందర్ ఉన్నారు.