కడపల్లి మృతుల కుటుంబాలకు జనసేన సాయం

కడపల్లి మృతుల కుటుంబాలకు జనసేన సాయం

చిత్తూరు: కడపల్లి దుర్ఘటన మృతుల కుటుంబాలకు జనసేన ఆర్ధిక సాయం అందచేసింది. ఒక్కో కుటుంబానికి రూ.13.25 లక్షలు.. గాయపడిన వారి కుటుంబాలకు రూ.1.25 లక్షల చొప్పున జనసేన పార్టీ, మెగా కుటుంబం, నిర్మాతలు, ఎన్.ఆర్.ఐ. తరఫున పరిహారం అందజేశారు. పార్టీ ముఖ్య నాయకులు హాజరై బాధిత కుటుంబాలను ఓదార్చి చెక్కులు అందచేశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం సమీపంలోని కడపల్లి దగ్గర ఈ నెల 1వ తేదీన చోటు చేసుకున్న దుర్ఘటన పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. కన్నుమూసిన జనసైనికుల కుటుంబాలకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్  ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందచేశామన్నారు. ఈ దుర్ఘటనలో కడపల్లి వాసులు మృతి చెందిన రాజేంద్రప్రసాద్,  సోమశేఖర్,  అరుణాచలం కన్నుమూసిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ తరఫున ప్రకటించిన సాయంతో పాటు మెగా హీరోలు రాంచరణ్, అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ సినిమాల నిర్మాతలు దిల్ రాజు, ఎ.ఎం.రత్నం, మైత్రీ మూవీస్ నవీన్, రవి, జనసేన ఎన్.ఆర్.ఐ. విభాగం వారు మృతుల కుటుంబాలకు తమ వంతు సాయం అందించారు.