నా ఒక్కడి ఆరాటం-పోరాటం సరిపోదు: పవన్ కళ్యాణ్

నా ఒక్కడి ఆరాటం-పోరాటం సరిపోదు: పవన్ కళ్యాణ్

భీమవరం: ప్రజల్లో ఆవేశం, కోరిక లేకపోతే తానొక్కడినే ఏమీ చేయలేనన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ . సోమవారం భీమవరంలో జరిగిన మీడియా సమావేశంలో పవన్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు కోరుకున్నప్పుడు ప్రత్యేక హోదా కోసం ఎంతకైనా నిలబడతానన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం తన ఒక్కడి ఆరాటం –  ఒక్కడి పోరాటం సరిపోదని అన్నారు.  ఏపీకి  స్పెషల్ స్టాటస్ సాధించుకునే విషయంలో తెలంగాణ ప్రజలని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు పోరాడిన తీరు ఆదర్శమన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ పై రాజకీయాలు చేస్తే తగదని, వ్యక్తిగత కక్షల వల్ల ప్రాజెక్ట్ కు నష్టం కలుగుతోందని  పవన్ అన్నారు. అర్ధాంతరంగా  పోలవరం ప్రాజెక్ట్ పనులను నిలిపివేయడం వెనుక ఏదో రాజకీయ కోణం ఉందనే అనుమానం కలుగుతుందన్నారు.  ప్రాజెక్టు నిర్మాణ విషయంలో జాప్యం చేస్తే మరింత వ్యయం పెరిగే అవకాశం ఉందని సూచించారు. ప్రాజెక్ట్ ముంపు నిర్వాసితులకు తక్షణమే పునరావాసం కల్పించాలని, పునరావాసం ఇవ్వకపోవడంతో నేడు చాలామంది వరదలతో ముంపు బారిన పడ్డారన్నారు.

అమరావతి విషయంలో అవినీతిని వెలికితీస్తామన్న వైసీపీ ప్రభుత్వం.. 20 వేల మంది ఉపాధి దెబ్బతీసిందని పవన్ విమర్శించారు. అమరావతి కట్టడాలను ఎందుకు ఆపారు, కాంట్రాక్టులు ఎందుకు వద్దన్నారని పవన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. పెట్టుబడిదారుల్లో అభద్రత నెలకొల్పడం, అయోమయం సృష్టించడం మంచిది కాదని సూచించారు.

అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ లో వ్యవహరించినట్లే కాపు రిజర్వేషన్ పై వైసీపీ వ్యవహరించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. కాపులకు 5 శాతం EWS రిజర్వేషన్ టీడీపీ పెట్టిందని,  వైసీపీ దాన్ని రద్దుచేసినట్లు అనిపిస్తుందన్నారు. వైఎస్ జగన్ కాపుల రిజర్వేషన్ పట్ల రాజకీయ ప్రయోజనాలు చూసి మాట్లాడినట్లుందన్నారు. ఇలాంటి సమస్యలు పరిష్కరించాలి తప్ప, తప్పించుకుంటే సరికాదని సూచించారు పవన్ .

పార్టీలో చర్చించాకే నిర్ణయం ప్రకటిస్తా

స్థానిక సంస్థల ఎన్నికలపై పోటీ పట్ల ఇంకా  ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు పవన్.  ఎవరితో కలిసి పోటీ చేస్తామనే మీడియా అడిగిన ప్రశ్నపై పవన్ సమాధానం దాటవేశారు.