కాన్బెర్రా(ఆస్ట్రేలియా): ప్రేమించిన అమ్మాయి తనను దూరం పెట్టడంతో కోపం పెంచుకున్న ఓ యువకుడు ఆమెను బతికుండగానే సజీవ సమాధి చేశాడు. ఈ దారుణ ఘటన ఆస్ట్రేలియాలో 2021 మార్చిలో జరిగింది. మన దేశంలోని పంజాబ్కు చెందిన జాస్మిన్ కౌర్ (21) నర్సింగ్ చదవడానికి ఆస్ట్రేలియా వెళ్లింది. అక్కడ ఆమెకు తారిక్జోత్ సింగ్ అనే వ్యక్తితో పరిచయం కాగా, అది ప్రేమగా మారింది. కొన్నాళ్లకు తారిక్ ప్రవర్తనలో మార్పు రావడంతో అతన్ని జాస్మిన్ దూరం పెట్టింది. దీంతో కోపం పెంచుకున్న తారిక్.. ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఆడిలైడ్ నుంచి జాస్మిన్ను కిడ్నాప్ చేసి, ఫ్లిండర్స్ రెంజర్స్కు తీసుకెళ్లాడు.
ఆమె చేతులు, కాళ్లను కేబుల్ వైర్లతో కట్టేసి, బతికి ఉండగానే గోతిలో పాతి పెట్టాడు. హత్య విషయం తొలుత తెలియకపోవడంతో స్థానిక పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, తారిక్ ను విచారించారు. దీంతో హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు. జాస్మిన్ను పాతిపెట్టిన చోటుకు తీసుకెళ్లగా, పోలీసులు ఆమె డెడ్బాడీని స్వాధీనం చేసుకొని, పోస్ట్మార్టానికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. జాస్మిన్ స్పృహలో ఉండగానే చాలా క్రూరంగా తారిక్ ఆమెను పూడ్చివేశాడని, ఊపిరి ఆడక ఆమె చనిపోయిందని మృతురాలి కుటుంబసభ్యుల తరుఫు లాయర్ వాదించారు. తన కుమార్తెకు జరిగిన తీవ్ర అన్యాయం జరిగిందని, దోషికి జీవిత ఖైదు శిక్ష విధించాలని ఆమె కోరారు.