జేఈఈ  మెయిన్  టాపర్స్​లో మనోళ్లు

జేఈఈ  మెయిన్  టాపర్స్​లో మనోళ్లు
  • రాష్ట్రం నుంచి ఇద్దరికి నేషనల్ ఫస్ట్ ర్యాంక్ 
  • ఏడుగురికి వంద పర్సంటైల్   
  • అడ్వాన్స్​డ్​కు అప్లై చేసుకునేందుకు 20వ తేదీ వరకు చాన్స్ 
  • రాష్ట్రం నుంచి ఇద్దరికి నేషనల్ ఫస్ట్ ర్యాంక్..  
  • ఏడుగురికి వంద పర్సంటైల్  

హైదరాబాద్, వెలుగు:  జేఈఈ మెయిన్ ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ(ఎన్టీఏ) రిలీజ్ చేసింది. మంగళవారం అర్ధరాత్రి టాపర్స్ తో పాటు పర్సంటైల్స్ వివరాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం18 మంది ఫస్ట్ ర్యాంకు సాధించగా, 44 మంది స్టూడెంట్లు వంద పర్సంటైల్ దక్కించుకున్నారు. రాష్ట్రం నుంచి ఏడుగురు, ఏపీ నుంచి ఆరుగురు వంద పర్సంటైల్ సాధించారు. ఫస్ట్ ర్యాంకు సాధించిన వారిలో తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి నలుగురు ఉన్నారు. గతంలో మార్కులు సమానంగా వస్తే ఏజ్​ఆధారంగా ర్యాంకులను కేటాయించేవారు. కానీ ఈ ఏడాది ఆ విధానానికి స్వస్తి చెప్పి, అందరికీ ఫస్ట్ ర్యాంకునే ఇచ్చారు. రాష్ట్రం నుంచి ఫస్ట్ ర్యాంకు సాధించిన వారిలో హైదరాబాద్​కు చెందిన కొమ్మ శరణ్య, ఎం.ఆదర్శ్ రెడ్డి ఉన్నారు. ఏపీ నుంచి దుగ్గినేని వెంకట ఫణీశ్​, పసల వీరశివ, కాంచనపల్లి రాహుల్ నాయుడు, కరణం లోకేశ్​ ఫస్ట్ ర్యాంకు సాధించారు. మన రాష్ట్రం నుంచి శరణ్య, ఎం.ఆదర్శ్ రెడ్డి, జ్యోసుల వెంకట ఆదిత్య, పి.లక్ష్మీసాయి లోకేశ్​ రెడ్డి, కటికెల ప్రణీత్ కుమార్, బి.రోహిత్​కుమార్ రెడ్డి, వీవీ కార్తికేయ సాయి వైదిక్ వంద పర్సంటైల్ సాధించిన వారిలో ఉన్నారు. దేశంలో అత్యధికంగా వంద పర్సంటైల్ సాధించిన రాష్ర్టాల్లో తెలంగాణ, ఢిల్లీ సమానంగా ఉన్నాయి. రిజల్ట్ ను jeemain.nta.nic.in, nta.ac.in, ntaresults.nic.in తదితర అఫీషియల్ వెబ్ సైట్లలో చెక్ చేసుకోవచ్చు. అయితే ఈసారి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, గర్ల్స్ తదితర కేటగిరీలవారీగా ర్యాంకులను ఎన్టీఏ వెల్లడించలేదు. ఫిబ్రవరి, మార్చి, జులై, ఆగస్టు నెలల్లో నాలుగు సెషన్లుగా జరిగిన జేఈఈ మెయిన్ ఎగ్జాంలకు 9,39,008 మంది హాజరయ్యారు. వీరిలో అమ్మాయిలు 2,80,067, అబ్బాయిలు 6,58,939, ఇద్దరు ట్రాన్స్​జెండర్లు ఉన్నారు.  
‘అడ్వాన్స్ డ్’ అప్లైకి 20 వరకు చాన్స్.. 
జేఈఈ అడ్వాన్స్​డ్ ఎగ్జాం రాసేందుకు ఈ సారి 2.50 లక్షల మందికి అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 15 సాయంత్రం నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అడ్వాన్స్​డ్ కు అప్లై చేసుకోవచ్చని ఐఐటీ ఖరగ్​పూర్ ప్రకటించింది. ఫీజు చెల్లించేందుకు 21 వరకు గడువు ఉంటుందని తెలిపింది. కాగా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 66.2214845 పర్సంటైల్, ఓబీసీ–ఎన్సీఎల్ లో 68.0234447, ఎస్సీలో 46.8825338, ఎస్టీలో  34.6728999, అన్​రిజర్డ్వ్ లో 87.8992241, యూఆర్–పీహెచ్ లో 0.0096375 పర్సంటైల్​ను ఎలిజిబిలిటీగా ఎన్టీఏ నిర్ణయించింది.