111 జీవో ఎత్తేస్తున్నం

111 జీవో ఎత్తేస్తున్నం
  • ఇది వికారాబాద్​, రంగారెడ్డి ప్రజలకు శుభవార్త
  • మూసీ, ఈసీ నదులు, జంట జలాశయాలు కలుషితం కాకుండా చూస్తం
  • సీఎస్​ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు: కేసీఆర్​

హైదరాబాద్​, వెలుగు: వికారాబాద్​, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు అడ్డంకిగా ఉన్న జీవో 111ను ఎత్తేస్తున్నం. మూసీ, ఈసీ నదులు, జంట జలాశయాలు కలుషితం కాకుండా పటిష్టమైన చర్యలు చేపడుతాం” అని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. చీఫ్‌‌‌‌ సెక్రటరీ ఆధ్వర్యంలో పొల్యూషన్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ బోర్డు, ఎన్విరాన్‌‌‌‌మెంట్‌‌‌‌, ఫారెస్ట్‌‌‌‌ శాఖలతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రీన్‌‌‌‌ జోన్‌‌‌‌లో మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ ఇంప్లిమెంట్‌‌‌‌ చేయాలని సీఎస్‌‌‌‌ను ఆదేశించామని తెలిపారు. కొన్ని రోజుల్లోనే సీఎస్‌‌‌‌ ఆధ్వర్యంలో కమిటీ సమావేశమై దీనిపై ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు. ఆ ప్రాంత ప్రజలకు ఇది శుభవార్త అని మీడియా సమావేశంలో సీఎం పేర్కొన్నారు. 

111 జీవో ఎత్తేస్తున్నం

సికింద్రాబాద్ వైపు కంటోన్మెంట్​ ప్రాంతం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో 111 జీవో ఉన్న కారణంగా అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం కలుగుతున్నదని రాష్ట్ర  కేబినెట్​ అభిప్రాయ పడ్డట్లు సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘హైదరాబాద్ తాగునీటి అవసరాలు, గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలతో ముడిపడి ఉన్నందున ఆ జలాశయాల క్యాచ్ మెంట్ ఏరియాలో నిర్మాణాలు చేయొద్దని గతంలో 111 జీవో అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు నగర తాగునీటి అవసరాలు గండిపేట, హిమాయత్ సాగర్ పై ఆధారపడి లేవు. కృష్ణా, గోదావరి జలాల ద్వారా నగర ప్రజల తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. దీంతో  111 జీవో ఉద్దేశం సంబద్ధతను కోల్పోయింది. ఎంతో కాలంగా 111 జీవో పరిధిలోని ప్రాంతాల ప్రజలు చేస్తున్న విన్నపాన్ని అర్థం చేసుకొని 111 జీవోను రద్దు చేయాలని కేబినెట్​ నిర్ణయించింది” అని సీఎంవో పేర్కొంది. అదే సమయంలో గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల పరిరక్షణ విషయంలోనూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రెండు జలాశయాలను కాళేశ్వరం జలాలతో అనుసంధానం చేసే పనులు వేగంగా నడుస్తున్నాయని, ఈ జలాశయాల ద్వారా తాగునీటి సరఫరా కోసం ఏర్పడి ఉన్న ప్రస్తుత వ్యవస్థను నగరంలో పచ్చదనం పెంపొందింపజేసే నీటి సరఫరాకు ఉపయోగించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ‘‘మూసీ సుందరీకరణ పెద్ద ఎత్తున జరుగుతున్నందున ఈ జలాశయాల ద్వారా నీటిని మూసీలోకి వదలడానికి తగిన పథకం గతంలోనే రూపొందింది. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈవిధంగా రెండు జలాశయాలు ఉపయోగంలోఉంటాయి. 11వేల ఎకరాల విస్తీర్ణంలోని ఈ రెండు జలాశయాలు కాలుష్యం కాటుకు గురికాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మురుగునీటి పారుదల నిర్మాణాలను వెంటనే చేయాలని, ఇతర పథకాలను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇందుకోసం చీఫ్ సెక్రటరీ  అధ్యక్షతన, పురపాలక శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ భాగస్వామ్యంతో కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు” అని సీఎంవో తెలిపింది.