ఇద్దరు జర్నలిస్టులకు నోబెల్ శాంతి బహుమతి

ఇద్దరు జర్నలిస్టులకు నోబెల్ శాంతి బహుమతి

శాంతి నెలకొల్పేందుకు వ్యక్తులు, సంస్ధలు చేసిన కృషికి ప్రతిఫలంగా ప్రకటించే నోబెల్ శాంతి పురస్కారానికి ఈ ఏడాది(2021) మరియా రెస్సా, దిమిత్రి మరటోవ్ కు ఎంపికయ్యారు. నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ ఇవాళ(శుక్రవారం) శాంతి పురస్కారం విజేతను ప్రకటించింది. సుస్థిర ప్రజాస్వామ్యానికి, చిరకాల శాంతికి భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యమే పునాది అని బలంగా నమ్మి, ఆచరించారని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది.

మారియా రెస్సా ఫిలిప్పినో అమెరికన్ జర్నలిస్ట్.CNN ఆగ్నేయాసియా విభాగంలో 20 ఏళ్ల పాటు ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. వ్యక్తి వాక్ స్వేచ్ఛను అనేక వేదికలపై నిర్భయంగా చాటారు. ఫిలిప్పీన్స్ చట్టాల ప్రకారం అనేక ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ, ఓసారి అరెస్ట్ అయినప్పటికీ తాను నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడ్డారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టే విమర్శకుల్లో మారియా రెస్సా ముందువరుసలో ఉంటారు. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా ఫేక్ న్యూస్ పైనా పోరాటం సాగించారు.

దిమిత్రి మరటోవ్ రష్యా జాతీయుడు. ఒక రష్యన్ జర్నలిస్ట్, నోవాయా గజెటా వార్తాపత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్. 24 ఏళ్ల పాటు ఆ పత్రిక ఎడిటర్‌గా చేశారు. రష్యా ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడంలోనూ, మానవ హక్కుల ఉల్లంఘనలపై నిలదీయడంలోనూ నోవాయా గెజెటాకు విశిష్ట గుర్తింపు ఉంది. అందుకు కారకుడు దిమిత్రి మరటోవ్. ఇప్పటి ప్రపంచంలోనూ పాత్రికేయ విలువలు, మూలాలకు కట్టుబడిన మరటోవ్ 2007లో ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు, 2010లో ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి లెజియన్ ఆఫ్ ఆనర్ ఆర్డర్ పురస్కారం అందుకున్నారు.