
- ఆరు నెలల్లో ఉపఎన్నిక
- మాగంటి కుటుంబానికి టికెట్ ఇచ్చే ఆలోచనలో బీఆర్ఎస్
- గ్రేటర్లో మరో సీటు పెంచుకునేందుకు కాంగ్రెస్ ఎత్తులు
- సత్తా చూపించేందుకు బీజేపీ ప్రయత్నం
హైదరాబాద్సిటీ,వెలుగు: గ్రేటర్ పరిధిలో జరగనున్న మరో ఉప ఎన్నికపై అన్ని పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఆరు నెలలలోపు ఇక్కడ ఎన్నికలు నిర్వహించాల్సి వుంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల్లో హడావుడి మొదలైంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీల్లోనూ ఆశావహులు ఉత్సాహం చూపిస్తున్నారు. టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. జూబ్లీహిల్స్నియోజకవర్గంలో మొత్తం 3,87,206 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో స్లమ్ఏరియాలు ఎక్కువగా ఉన్నాయి.
దీంతో ఇక్కడ పాగా వేయాలంటే కాస్త మాస్ఫాలోయింగ్ ఉన్న వారికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోలింగ్శాతం 47.49 నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా మూడు పర్యాయాలు విజయం సాధించారు. గత ఎన్నికల్లో మాగంటి 80,549 ఓట్లు సాధించగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజాహరుద్దీన్కు 64,212 ఓట్లు వచ్చాయి.
16,337 ఓట్లతో ఆధిక్యంతో మాగంటి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్లు కీలకంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్తో ఉన్న అవగాహనలో భాగంగా మజ్లిస్ పోటీ చేయలేదు. త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో మాగంటి కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చే యోచనలో బీఆర్ఎస్ పెద్దలు ఉన్నట్టు సమాచారం.
మరోసీటు పెంచుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చినా గ్రేటర్ పరిధిలో ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవలేదు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిని యాక్సిడెంట్లో మృతిచెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ గెలుపుతో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్పార్టీ బోణి కొట్టింది. తాజాగా జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి మృతితో ఉపఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ మరో సీటు పెంచుకోవాలన్న ఆలోచనలో వుంది. ఇదిలా ఉండగా ఈ నియోజకవర్గం ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు కాంగ్రెస్లో చాలా మంది పోటీ పడుతున్నట్టు సమాచారం. అయితే గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన అజారుద్దీన్ మళ్లీ బరిలో దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. అలాగే విజయారెడ్డి సైతం జూబ్లీహిల్స్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. తన తండ్రి దివంగత పీజేఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో తనకు కలిసి వస్తుందని ఆమె భావిస్తున్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి మజ్లిస్ అభ్యర్థిగా పోటీచేసిన నవీన్యాదవ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన కూడా తనకు అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలను కోరుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం మజ్లిస్ పార్టీ కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉన్న నేపథ్యంలో తనకు మజ్లిస్ నుంచి కూడా మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు.
సిట్టింగ్ సీటు కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు
ఇదిలా ఉండగా తమ సిట్టింగ్ సీటును చేజార్చుకోవద్దన్న పట్టుదలతో బీఆర్ఎస్ ఉంది. మాగంటి కుటుంబ సభ్యులనే పోటీ చేయించాలని భావిస్తున్నట్టు సమాచారం. సానుభూతి ఓట్లను సాధించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే గతంలోనూ కంటోన్మెంట్ ఎన్నికలో లాస్యనందిత కుటుంబం నుంచి ఆమె సోదరిని పోటీలో నిలిపినా సానుభూతి పనిచేయలేదు. ఈ పరిణామం పునరావృతం అవుతుందేమోనన్న అనుమానం ఆపార్టీలో నెలకొంది. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ రావుల శ్రీధర్రెడ్డి ఈ సారి తనకు అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పెద్దలను కోరుతున్నట్టు తెలిసింది.
పార్టీకి సవాల్గా భావిస్తున్న బీజేపీ
ఉపఎన్నికల్లో గెలవడం ద్వారా హైదరాబాద్లో తమ పార్టీకి పట్టు పెరుగుతున్నదని నిరూపించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఒక పక్క కేంద్రంలో మోదీ పాలన, వివిధ సంక్షేమ పథకాల అమలుతో బీజేపీకి ప్రజలు దగ్గరయ్యారన్న సంకేతాన్ని ఇవ్వడానికి ఆపార్టీ కూడా ఈ ఉప ఎన్నికలను సవాల్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. అయితే అభ్యర్థిగా ఎవరిని దింపుతారన్న విషయంపై ఆ పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లంకెల దీపక్రెడ్డి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే పార్టీ మహిళా నాయకురాలు జూటూరు కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ వీరపనేనితో పాటు బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి కూడా పోటీకి ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.
పరేషాన్లో పతంగ్ పార్టీ
కాగా మజ్లిస్ పార్టీ ప్రతిసారీ జూబ్లీహిల్స్లో పోటీ చేయాలని భావిస్తూ చివరి నిమిషంలో ఎన్నికల అవగాహనలో భాగంగా రాష్ట్రంలోని అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటూ ఇక్కడ పోటీ చేయలేదు. అలాగే ఈసారి కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉన్న నేపథ్యంలో పోటీ చేస్తుందా? లేక ఆ పార్టీకి మద్దతు ఇస్తుందా? అన్న విషయంలో ఆసక్తి నెలకొంది. ప్రతి సారీ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఆ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటుంది.