జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది. నవంబర్ 7 ఉదయం వరకు రూ. 3.3 కోట్ల నగదు ..701 లీటర్ల మద్యం సీజ్ చేశారు అధికారులు.
స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ.4 లక్షల 74 వేల 322. 2 కిలోలకు పైగా గంజాయి . 0.11 గ్రాముల MDMAతో సహా మాదకద్రవ్యాలను కూడా ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. వీటి విలువ రూ.లక్షా 97 వేల 600 ఉంటుందని అధికారులు వెల్లడించారు
నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో భాగంగా 24 కేసులు నమోదయ్యాయి. వీటిలో 15 ఎన్నికల సంబంధిత హింసకు సంబంధించినవి, ఏడు అనుమతి లేకుండా సమావేశాలు , ప్రసంగాలకు సంబంధించినవి. రెండు ఓటర్లను ఆకర్షించే ఉద్దేశ్యంతో నగదు, సరకుల పంపిణీకి సంబంధించినవి.
నియోజకవర్గంలో 45 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 45 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు . ఈ బృందాల వాహనాలకు జీపీఎస్, పీటీజెడ్ కెమెరాలను అమర్చి, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి 24గంటలు పర్యవేక్షిస్తున్నారు.
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. సిట్టింగ్ సీటు దక్కించుకోవాలని బీఆర్ఎస్, జూబ్లీహిల్స్ లో గెలవాలని అధికార పార్టీ, సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ .. 14న కౌంటింగ్ జరగనుంది.
జూబ్లీహిల్స్ లో మొత్తం 4,లక్షల 13వందల 65 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు - 2 లక్షల8 వేల 561.. లక్షా 92వేల779 మహిళల ఓట్లు,25 ఇతరుల ఓట్లు ఉన్నాయి .నియోజకవర్గంలోని మొత్తం 407 పోలింగ్ కేంద్రాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా, వీటిలో 54 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. పోలింగ్ రోజున ఈ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
