విశ్వవిఖ్యాతకు జూనియర్ ఎన్టీఆర్ నివాళులు

విశ్వవిఖ్యాతకు జూనియర్ ఎన్టీఆర్ నివాళులు

మాజీ సీఎం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్  నివాళులర్పించారు. ఈ సందర్భంగా  "మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా .. సదా మిమ్మల్ని స్మరించుకుంటూ" అంటూ తారక్ ట్వీట్ చేశారు. 

ఇక నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో శతజయంతి వేడుకలను ప్రారంభించారు. నిన్న సాయంత్రమే నిమ్మకూరు చేరుకున్న బాలయ్య ఈ ఉదయం గ్రామంలోని దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం తన తండ్రి-తల్లి విగ్రహాలకు నివాళి అర్పించారు. అదేవిధంగా తెనాలి వెళ్లనున్న బాలయ్య అక్కడ పెమ్మసాని థియేటర్ లో ఏడాది పాటు ప్రదర్శించే ఎన్టీఆర్ సినిమాలను ప్రారంభించనున్నారు.