కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని, మత రాజకీయాల్ని ప్రజలు కోరుకోవట్లేదనే దానికి ఇది ఉదాహరణ అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధ రామయ్య పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విక్టరీపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కన్నడ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర గెలువడంతో కీలక పాత్ర పోషించిందని అన్నారు. విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేశారు.
గతంలో ప్రజా ప్రభుత్వాలను బీజేపీ కూలదోసి అక్రమంగా అధికారంలోకి వచ్చిందని అన్నారు. బీజేపీ రాజకీయంతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. ఆపరేషన్ లోటస్ పేరుతో 2018 లో సైతం ఇదే తరహా రాజకీయాలు చేశారని చెప్పారు. మరో సారి అలా జరగకుండా కాంగ్రెస్కే స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారని కన్నడ ప్రజలనుద్దేశించి అన్నారు. ఈ ఎన్నికల ఫలితం లోక్సభ ఎన్నికలకు గీటురాయని చెప్పారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి బీజేపీని ఓడించేలా చూస్తామని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తీర్పు నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు వ్యతిరేకంగా వచ్చిందని అన్నారు.