బీఆర్ఎస్ కు ఝలక్ ల మీద ఝలక్ లు తగులుతున్నాయి. నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. కొందరు కాంగ్రెస్ లో చేరుతుండగా..మరికొందరు బీజేపీలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ ను వీడారు. ముఖ్యంగా పార్టీ బలంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లోనూ షాకిస్తున్నారు నేతలు.
మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, పలువురు కార్పొరేటర్లు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.. లేటెస్ట్ గా కార్వాన్ బీఆర్ఎస్ ఇన్ ఛార్జ్ ఠాగూర్ జీవన్ సింగ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. తనకు రెండు సార్లు కార్వాన్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.