నటుడు కత్తి మహేష్ కన్నుమూత

నటుడు కత్తి మహేష్ కన్నుమూత

సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కత్తి మహేశ్  చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో  ఇవాళ తుదిశ్వాస విడిచారు. జూన్ 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. కత్తి మహేశ్ కారు ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది.   ఈ ప్రమాదంలో కత్తి మహేశ్ కంటికి తీవ్ర గాయాలయ్యాయి. ముందుగా నెల్లూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు. ఏపీ ప్రభుత్వం కత్తి మహేశ్ వైద్య చికిత్స ఖర్చులకు రూ.17లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రిలీజ్ చేసింది. ప్రమాదంలో తీవ్రంగా గాయాలు కావడంతో... చికిత్సకు కత్తి మహేశ్ సహకరించలేదని డాక్టర్లు తెలిపారు. ఈ మధ్యాహ్నం మృతిచెందినట్టు ప్రకటించారు. 

సినీ విమర్శకుడిగా కత్తిమహేశ్  టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. తనదైన విశ్లేషణతో ఎందరో సినీ అభిమానులను సొంతం చేసుకున్నారు. పవన్ కల్యాణ్ పై విమర్శలు.. అభిమానులతో గొడవ అప్పట్లో  పెద్ద సంచలనమే రేపాయి. బిగ్ బాస్ లోనూ పాల్గొని పాపులారిటీ పెంచుకున్నారు. పెసరట్టు అనే సినిమాతో దర్శకుడు అనిపించుకున్నారు. నటుడిగానూ పలు సినిమాల్లో కనిపించారు కత్తి మహేశ్. మిత్రులతో కలిసి సోషల్ సర్వీస్ చేశారు. రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్ మృతి చెందడంపై ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు.