జూన్ 15 నుంచి కవిత ‘బాయిబాట’..కోల్బెల్ట్ ప్రాంతాల్లో ఆరు రోజుల పాటు పర్యటన

జూన్ 15 నుంచి కవిత ‘బాయిబాట’..కోల్బెల్ట్ ప్రాంతాల్లో  ఆరు రోజుల పాటు పర్యటన

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్​కవిత ఈ నెల 15 నుంచి సింగరేణి ప్రాంతంలో పర్యటించనున్నారు. ‘బాయిబాట’ పేరుతో సింగరేణి అండర్​ గ్రౌండ్, ఓపెన్​ కాస్ట్​ గనుల వద్ద సింగరేణి కార్మికులతో కవిత సమావేశాలు నిర్వహించనున్నారు. బాయిబాట మొదటి విడత కార్యక్రమంలో భాగంగా ఆరు రోజులపాటు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. ఈ నెల 15న చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మందమర్రి ఏరియాలోని బొగ్గు గనుల ప్రాంతంలో పర్యటించనున్నారు. 

16న మంచిర్యాల నియోజకవర్గంలోని శ్రీరాంపూర్ ఏరియా, 17న రామగుండం నియోజకవర్గంలోని ఆర్ జీ – 1 ఏరియా, 18న రామగుండం నియోజకవర్గంలోని ఆర్ జీ – 2 ఏరియా, 19న మంథని నియోజకవర్గంలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్, ఆర్ జీ – 3 ఏరియా, 20న భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి ఏరియా బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద పర్యటించి సింగరేణి కార్మికులతో ఆమె సమావేశమవుతారు. కాగా, బుధవారం కవితతో బ్రిటిష్​ డిప్యూటీ హై కమిషనర్​ ఆరెత్​ విన్​ ఓవెన్​ సమావేశమయ్యారు. టీఆర్​ఎస్​ పార్టీ ఆఫీసులో జరిగిన ఈ భేటీలో హైదరాబాద్​ బ్రిటిష్​ హైకమిషన్​ పొలిటికల్​ అండ్​ ఎకనామిక్​ అడ్వైజర్​ నళిని రాఘవన్​ కూడా పాల్గొన్నారు. ఇండియా, యూకే మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఇతర అంశాలపై చర్చించారు.