- పసుపు రంగుపై నీలి రంగులో తెలంగాణ, అడుగున ఆకుపచ్చ అంచుతో జెండా
- ఐదు అంశాలు ప్రధానంగా ‘పాంచజన్యం’ ఎజెండా
- విద్య, వైద్యం ఫ్రీ.. రైతును రాజుగా చేసేలా ఎవుసం
- యువతకు వ్యాపారానికి రూ.20 కోట్ల దాకా రుణాలు.. మొదటి ఏడాదే 4 లక్షల ఉద్యోగాలు
- అన్ని వర్గాలకూ న్యాయం చేసేలా సామాజిక న్యాయ తెలంగాణ స్థాపిస్తామని హామీలు
హైదరాబాద్, వెలుగు: కవిత పార్టీ పేరుపై సస్పెన్స్కు తెరపడింది. బీఆర్ ఎస్ వద్దనుకున్న టీఆర్ఎస్నే ఆమె తన పార్టీ పేరుగా ఎంచుకున్నారు. టీఆర్ఎస్ పూర్తిపేరులోని చివరి పదం తప్ప.. మిగతా అంతా సేమ్ టు సేమ్ తన పార్టీకి అన్వయించుకున్నారు. శనివారం గ్రాండ్గా నిర్వహించిన ఆవిర్భావ సభలో ఆమె తన పార్టీ పేరు ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అని ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్లో పార్టీ పేరు, జెండా, ఎజెండాను కవిత వెల్లడించారు. మూడు పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్పై తన పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఐదు అంశాలు ప్రధానంగా ‘పాంచజన్యం’ ఎజెండాను ప్రకటించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక సమానత్వం అంటూ, వాటిపై తాము ఎలా ముందుకు వెళ్తామనేది రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. ఇక జెండాను మూడు రంగుల మేళవింపుతో రూపొందించారు. పసుపు రంగు జెండాపై నీలి రంగు తెలంగాణ చిత్రం, ముదురు ఆకుపచ్చ రంగు అంచుతో జెండాను రూపొందించారు. సౌభాగ్యానికి ప్రతీక అయిన పసుపు, బడుగు, బలహీన వర్గాల సంపూర్ణ వికాసానికి ప్రతీక అయిన నీలం, పాడిపంటలతో అలరారే గ్రామసీమలకు, రైతన్నలకు ప్రతీకగా ఆకుపచ్చ రంగులను జెండాలో పొందుపరిచారు. ఆ జెండాపై తెలుపు రంగు అక్షరాలతో ‘టీఆర్ఎస్–తెలంగాణ రాష్ట్ర సేన’ అని వచ్చేలా చూసుకున్నారు. ఇక, వేదిక వద్ద తెలంగాణ సంప్రదాయాలకు సంబంధించిన ప్రదర్శనలు చేశారు.
భారీగా తరలివచ్చిన జనాలు..
తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీ ప్రకటనకు ముందు బంజారాహిల్స్లోని నివాసంలో కవిత, అనిల్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గన్పార్క్లోని అమర వీరుల స్తూపం వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా మునీ రాబాద్లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్కు చేరు కున్నారు. కన్వెన్షన్ సెంటర్ ప్రధాన ద్వారం (కాళోజీ ద్వారం) వద్ద తెలంగాణలోని అన్ని కళారూపాలకు చెందిన కళాకారులు, తెలంగాణ జాగృతి నేతలు ఘన స్వాగతం పలికారు. కాళోజీ ద్వారం నుంచి సభా వేదిక వరకు కళాకారులతో కలిసి ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం పార్టీ పేరును ప్రకటించారు. కాగా, కవిత రాజకీయ పార్టీ ప్రకటన సభకు తెలంగాణ నలుమూలల నుంచి జాగృతి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 1,500 బస్సులు, 2 వేలకుపైగా ఇతర వాహనాల్లో మునీరాబాద్కు చేరుకున్నారు. సుమారు 40 వేల మంది కార్యకర్తలు మారుమూల ప్రాంతాల నుంచి తరలివచ్చారు. సభ అనంతరం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పార్టీ ప్రకటన అనంతరం కేడర్తో కలిసి కల్వకుంట్ల కవిత భారీ ర్యాలీగా హైదరాబాద్కు తిరిగివచ్చారు.
కవిత ప్రకటించిన పాంచజన్యం ఎజెండా ఇదే..
1 ఎంత చదువుకున్నా ఫ్రీ
తాము అధికారంలోకి వస్తే ప్రతి పేద, మధ్యతరగతి ప్రజలతోపాటు అందరికీ ఉచిత విద్య అందిస్తామని టీఆర్ఎస్ అధినేత్రి కవిత ప్రకటించారు. స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు ఎంత పెద్ద చదవులైనా ఫ్రీగా చెప్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లోనూ చదువును అందరికీ ఫ్రీగా అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠ శాలల్లో కనీసం బాత్రూంలు కూడా లేనంతగా పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. అందుకే గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడినీ అంతే పవిత్రంగా చూడాల్సిన అవసరముందన్నారు. అందుకే ప్రతి ఊరిలో ఒక బడి.. ఆ బడిలో ప్రతి క్లాసుకూ ఓ టీచర్ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంలో వచ్చేది మీ అమ్మే కాబట్టి.. ఆ అమ్మ జేబు చూడకుండా కడుపు చూస్తుందని, ఎంత వరకు చదువుకున్నా ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చదివించే బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు. ఇంజనీరైనా, డాక్టరైనా, రాకెట్ సైంటిస్ట్ అయినా ఏం చదువుకున్నా మన బిడ్డలకు ఫ్రీగా చదువులు చెప్పిస్తామన్నారు. యూనివర్సిటీ స్టూడెంట్లు ఒకప్పుడు రక్తం అమ్ముకుని చదువుకునేటోళ్లని, ఇప్పుడు రెస్టారెంట్ల వద్ద గిగ్వర్కర్లుగా మారి చదువుకుంటున్నారని తెలిపారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం యూనివర్సిటీలను పట్టించుకోలేదన్నారు.
2 ఎంత పెద్ద రోగమైనా ఉచిత వైద్యం
వైద్యం కోసం జేబులు గుల్ల చేసుకుంటున్న పరిస్థితులున్నాయని, అందుకే అందరికీ ఉచిత వైద్యం అందిస్తామని కవిత ప్రకటించారు. ఏ రోగమైనా.. ఎంత పెద్ద జబ్బు అయినా.. ఎంత పెద్ద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నా.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం చేయించే బాధ్యత తమదనేని తెలిపారు.
3 రైతును రాజును చేస్తం
అధికారంలోకి వస్తే రైతును రాజును చేస్తామని కవిత తెలిపారు. ‘‘రైతుకు మహా అయితే భూమి కష్టాలుంటయ్. ఎమ్మార్వో ఆఫీసుకెళ్తే మర్యాదిస్తరా? మాసిపోయిన బట్టలు, మట్టి చెప్పులని చూడను కూడా చూడరు. అదే సూటుబూటు వేసుకుని ఎవరైనా వస్తే కుర్చీ వేసి కూర్చోబెట్టి పని చేస్తరు. కానీ, మన ప్రభుత్వం వస్తది. రైతే రాజు అనే నినాదాన్ని నినాదం చేస్తం. అందుకే ఎమ్మార్వో ఆఫీసైనా, కలెక్టర్ ఆఫీసైనా.. రైతు కోసం
ప్రత్యేకంగా కౌంటర్ ఉండాల్సిందే. రైతులకు ప్రత్యేకంగా కుర్చీ వేసి పనులు చెయ్యాల్సిందే. రైతును అని గర్వంగా చెప్పుకునేలా చేస్తం. రైతులు గోస పడ్తున్నరు’’ అని ఆమె పేర్కొన్నారు.
4 మొదటి ఏడాదే 4 లక్షల ఉద్యోగాలు
ప్రభుత్వాలేవైనా యువతను ఉద్యోగాలే చేసి
బానిసల్లా బతకాలనేలా చెప్తున్నాయని, యువత ఆలోచనలేంటో తెలుసుకోవడం లేదని కవిత అన్నారు. ఉపాధి అంటే కేవలం ఉద్యోగం కాదని తెలిపారు. అందుకే యువత వ్యాపారం చేసుకునేలా రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు ప్రభుత్వం నుంచే రుణాలిస్తమని వెల్లడించారు. యూత్ ఎంపవర్మెంట్ గ్రూప్స్ తయారు చేస్తామన్నారు. యూత్ను నమ్ముతున్నా అని చెప్పారు. ఉద్యోగాలు చేయాలనుకునే యువతకు మొదటి ఏడాదే సింగిల్ నోటిఫికేషన్తో 4 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యమకారులకు లక్ష ఉద్యోగాలిస్తామని చెప్పారు. 2014 జూన్ 2 అపాయింటెడ్ డే నాటి నుంచి వారికి సూపర్ న్యూమరరీ ఉద్యోగాలిస్తామని తెలిపారు.
5 సామాజిక న్యాయ తెలంగాణ
సామాజిక న్యాయ తెలంగాణ సాధించాల్సిందేనని కవిత స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీ, మైనారి టీలకు న్యాయం జరగాలన్నారు. మహిళా భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. సెల్ఫ్హెల్ప్ గ్రూప్స్లా కాకుండా ప్రాపర్ గ్రాంట్ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు.

