- తెలంగాణ వస్తే 11 రోజులు ఉపవాసం ఎందుకు ఉన్నడో పవన్కల్యాణ్కే తెలియాలి
- సింగరేణిని కాపాడేందుకు బొగ్గు బ్లాకులు కేటాయించాలి : కల్వకుంట్ల కవిత
గోదావరిఖని, వెలుగు : రేవంత్రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ పరువు తీయడమే పనిగా పెట్టుకున్నారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని జీడీకే 11వ గని ఆవరణలో జరిగిన గేట్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి... ‘అప్పు కోసం ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయే వాళ్లను చూసినట్లు చూస్తున్నారు, మహారాష్ట్ర సీఎం తన ఫోన్ ఎత్తడం లేదు, నేను హిట్లర్ లాంటి వాడిని’ అనే మాటలు మాట్లాడుతారా ? అని ప్రశ్నించారు. సీఎం మాటల కారణంగానే ఏపీ నాయకులు మళ్లీ తెలంగాణపై పెత్తనం చేసే కుట్రలు చేస్తున్నారన్నారు.
తెలంగాణ ఏర్పడితే 11 రోజులు ఉపవాసం ఎందుకున్నాడో పవన్ కల్యాణ్కే తెలియాలన్నారు. సింగరేణి సంస్థను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్కువ బొగ్గు బ్లాక్లు కేటాయించాలని, అండర్ గ్రౌండ్ మైనింగ్ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ యూనియన్తో కలిసి పోరాటం చేస్తామని చెప్పారు. సింగరేణి కార్మికుల కష్టాలపై మాట్లాడాల్సిన ఏఐటీయూసీ మౌనంగా ఉండడం సరికాదన్నారు.
సింగరేణి డబ్బులతో నిర్మించిన మెడికల్ కాలేజీలో 25 శాతం సీట్లు కార్మికుల పిల్లలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులను కలిసేందుకు వస్తే గేట్లు బంద్ పెట్టి ఎందుకు అడ్డుకుంటున్నారని, సింగరేణి కార్మికులను ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు కలువొద్దా అని ప్రశ్నించారు. అనంతరం గోదావరిఖని మెయిన్ చౌరస్తా వరకు ఆమె ఆటోలో ప్రయాణించారు. గోదావరిఖని తిలక్నగర్లో టీఆర్ఎస్ ఆఫీస్ను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ జనార్ధన్, హెచ్ఎంఎస్ యూనియన్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, ఎల్.వెంకటేశ్, ఆరెల్లి పోచం పాల్గొన్నారు.
