ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను తుంగలో తొక్కుతూ కేసీఆర్ ఫ్యామిలీ వందల ఎకరాల భూములను చెరబట్టిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. చట్ట ప్రకారం భార్య, భర్త, మైనర్ లేదా అవివాహిత పిల్లలను ఒక యూనిట్గా పరిగణిస్తారని, నిబంధనల మేరకు ఒక కుటుంబానికి గరిష్టంగా 27 ఎకరాల తరి లేదా 54 ఎకరాల మెట్ట మాత్రమే ఉండాలని అన్నారు. కానీ మాజీ సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ పేరిట సిద్దిపేట అర్బన్, మర్కూక్ మండలాల్లోని మూడు గ్రామాల్లో ఏకంగా 67.5 ఎకరాల తరి భూమి ఉందని సీఎం వెల్లడించారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పాలకులే స్వయంగా తుంగలో తొక్కి భూదాహం ప్రదర్శించారని ఫైర్ అయ్యారు.
