హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్పై బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ శుక్రవారం పోస్ట్మార్టం నిర్వహించారు. ప్రగతి భవన్ లో మంత్రులు కేటీఆర్, హరీశ్రావుతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల ఎలక్షన్ ఇన్చార్జీలతో రివ్యూ చేశారు. పోలింగ్బూత్ ల వారీగా ఎన్ని ఓట్లు పోల్అయ్యాయి.. అందులో వివిధ పథకాల లబ్ధిదారులు ఎంత మంది ఓటేశారు. లబ్ధిదారుల ఓట్లలో ఎన్ని ఓట్లు బీఆర్ఎస్కు పోల్కావచ్చు, ఇతర పార్టీలకు ఎన్ని ఓట్లు వస్తాయి.. ఇతరుల ఓట్లు ఎంతమేరకు వస్తాయి అనే సమాచారం సేకరించారు. వివిధ సర్వే ఏజెన్సీలతో పాటు ఇంటెలిజెన్స్ రిపోర్టులతో ఆయా నివేదికలను సరి పోల్చి బీఆర్ఎస్ఎన్ని సీట్లలో విజయం సాధించే అవకాశముందో అంచనాకు వచ్చారు. అనంతరం మంత్రులు నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి, ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్, మహబూబ్నగర్, ఆదిలాబాద్జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ స్పందిస్తూ.. మళ్లీ మనమే రాష్ట్రానికి సుపరిపాలన అందించబోతున్నామని చెప్పినట్టుగా తెలిసింది. ‘‘ఎందుకు ఆగమాగం పరేషాన్అయితుండ్రు.. రెండు రోజులు నిమ్మలంగా ఉండండి, మూడో తేదీన అందరం కలిసి సంబరాలు చేసుకుందాం..” అని కేసీఆర్ వారితో చెప్పినట్టుగా తెలిసింది.
4న రాష్ట్ర కేబినేట్ భేటీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజే సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ కానున్నట్లు సీఎం పీఆర్వో శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గం సమావేశం జరగనున్నట్లు వెల్లడించారు.