
రంగారెడ్డి జిల్లా: గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ గణేశ్ లడ్డూ వేలంలో రికార్డ్ ధర పలికింది. గణపతి లడ్డూ ప్రసాదం వేలం వేయగా రూ.1.87 కోట్లు ధర పలికింది. గణేశ్ లడ్డూ ప్రసాదం కోటీ 87 లక్షలు వేలంలో పలకడం అలాంటిఇలాంటి విషయం కాదు. హైదరాబాద్ గణేశ్ లడ్డూ వేలం అంటే అందరికీ గుర్తొచ్చేది బాలాపూర్ గణనాథుని లడ్డూ ప్రసాదమే. గతేడాది బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలంలో రూ.27 లక్షలు పలికింది. ఈ రికార్డు 2024లో ఇప్పటికి రెండుసార్లు బద్ధలయింది.
ఐటీ కారిడార్పరిధిలోని మైహోం భుజా అపార్ట్మెంట్లో వినాయకుడి లడ్డూ రికార్డు ధర పలికింది. ఆదివారం నిర్వహించిన వేలంలో ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన వ్యాపారవేత్త కొండపల్లి గణేశ్రూ.29 లక్షలకు దక్కించుకున్నాడు. ఏటా బాలాపూర్లడ్డూకు దీటుగా ఇక్కడ గణేశ్లడ్డూ వేలం జరుగుతోంది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లమండలం ముడిమ్యాలలోని గణేశ్లడ్డూ రూ.12.16 లక్షలు పలికింది. ఆదివారం నిర్వహించిన వేలంలో గ్రామానికి చెందిన హరికిషన్రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది బాలాపూర్వినాయకుడి లడ్డూ ధర రూ.27లక్షలు కాగా, మైహోం భుజాలోని లడ్డూ రూ.25.50 లక్షలు పలికింది. ఈసారి అంతకు మించి వేలం జరగడం విశేషం. ఈ రెండు లడ్డూ వేలం రికార్డులును కీర్తి రిచ్ మండ్ విల్లాస్ గణేశ్ లడ్డూ వేలం తిరగరాసింది.
ఇదిలా ఉండగా.. హుస్సేన్సాగర్కు సుమారు 21 కిలో మీటర్ల దూరం నుంచి తరలివచ్చే బాలాపూర్ శోభాయాత్రే అది పెద్దది. ఇక్కడ జరిగే లడ్డూ వేలం పాటను రాష్ట్రమంతా ఆసక్తిగా గమనిస్తుంది. వేలం తర్వాత మొదలయ్యే శోభాయాత్ర బాలాపూర్, కేశవగిరి, చాంద్రాయణ గుట్ట మీదుగా చార్మినార్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్బాగ్, లిబర్టీ వై జంక్షన్ మీదుగా హుస్సేన్ సాగర్కు రాత్రి వరకు చేరుకోనుంది. దీన్ని పర్యవేక్షించేందుకు ప్రధాన శోభాయాత్ర మార్గంలో 733 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.