
భోపాల్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ నేషనల్ పార్క్ ప్రాంతంలోని అడవుల్లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. DRG, CoBRA, STF సహా ఉమ్మడి దళాల ఆపరేషన్ లో భాగంగా జరిగిన కాల్పుల్లో కీలక మావోయిస్టు నేత సుధాకర్ అలియాస్ సింహాచలం మృతి చెందారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలలో సుధాకర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేతలలో ఒకరు. అతనిపై రూ. కోటి రివార్డు ఉంది. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
బస్తర్, అబుజ్మద్లను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు భద్రతా దళాలు భారీ ఎత్తున గాలింపు చర్యలు ప్రారంభించాయి. గత నెలలో జరిగిన మరో ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలకనేత బసవరాజు మృతిచెందిన తర్వాత సుధాకర్ మృతిచెందడం మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నారాయణపూర్-బీజాపూర్ సరిహద్దులో 50 గంటలకు పైగా సాగిన కూంబింగ్ తర్వాత ఈ ఎన్కౌంటర్ జరిగింది.
2026 మార్చి 31 లోపు నక్సలిజాన్ని నిర్మూలిస్తామని మోడీ ప్రభుత్వం శపథం చేసిన విషయం తెలిసిందే..ఈక్రమంలో ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలలో భారీగా భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. పలుమార్టు జరిగిన ఎన్ కౌంటర్లో పలువురు మావోయిస్టు కీలక నేతలతో సహా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఏప్రిల్ నెల చివరి వారంలో అనేకమంది మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ జిల్లాలో 24 మంది మావోయిస్టులు సరెండర్ కాగా.. వారిలో 14 మందిపై మొత్తం రూ. 28.50 లక్షల రివార్డు ఉంది.
ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత, ఛత్తీస్గఢ్, తెలంగాణ ,మహారాష్ట్రలలో 54 మంది నక్సలైట్లను అరెస్టు చేశారు. 84 మంది నక్సలైట్లు లొంగిపోయారు.