ఖమ్మం జిల్లా పెనుబల్లి తహసీల్దార్, జీపీవోపై సస్పెన్షన్‌‌ వేటు

ఖమ్మం జిల్లా పెనుబల్లి తహసీల్దార్, జీపీవోపై సస్పెన్షన్‌‌ వేటు

పెనుబల్లి, వెలుగు: ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని ప్రైవేట్‌‌ వ్యక్తులకు ట్రాన్స్‌‌ఫర్‌‌ చేసిన ఖమ్మం జిల్లా పెనుబల్లి తహసీల్దార్, జీపీవోపై సస్పెన్షన్‌‌ వేటు పడింది. పెనుబల్లి మండలం చింతగూడెం రెవెన్యూలోని 71/4, 71/6,71/7 సర్వే నంబర్లలో ఉన్న 1.21 ఎకరాల సీలింగ్‌‌ భూమిని అదే గ్రామానికి చెందిన శీలం లీలావతి పేరున ట్రాన్స్‌‌ఫర్‌‌ చేస్తూ జీపీవో రవికుమార్‌‌ స్టేట్‌‌మెంట్‌‌ రికార్డు చేయగా, తహసీల్దార్‌‌ శ్రీనివాస్‌‌యాదవ్‌‌ డిజిటల్‌‌ సైన్‌‌ క్లియర్‌‌ చేశారు. దీంతో ఆ భూమి ప్రైవేట్‌‌ వ్యక్తులకు చెందినదిగా భూభారతి పోర్టల్‌‌లో నమోదైంది.

చింతగూడెం గ్రామస్తులు శుక్రవారం కల్లూరు సబ్‌‌కలెక్టర్‌‌ అజయ్‌‌యాదవ్‌‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ఆయన.. తహసీల్దార్‌‌ శ్రీనివాస్‌‌యాదవ్‌‌, జీపీవో రవికుమార్‌‌ నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని ప్రైవేట్‌‌ వ్యక్తులకు ట్రాన్స్‌‌ఫర్‌‌ చేశారని నిర్ధారిస్తూ కలెక్టర్‌‌కు రిపోర్ట్‌‌ ఇచ్చారు. దీంతో తహసీల్దార్‌‌తో పాటు జీపీవోను సస్పెంచ్‌‌ చేస్తూ కలెక్టర్‌‌ అనుదీప్‌‌ దురిశెట్టి మంగళవారం ఆర్డర్స్‌‌ జారీ చేశారు. 

ఆదిలాబాద్‌‌ జిల్లాలో హెచ్‌‌ఎం...
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆదిలాబాద్‌‌ జిల్లా ఇచ్చోడ మండలం మేడిగూడ ఆశ్రమ స్కూల్‌‌ హెచ్‌‌ఎం స్వర్ణలతపై సస్పెన్షన్‌‌ వేటు పటింది. మెనూ ప్రకారం భోజనం అందించకపోవడం, క్వాలిటీ లేకపోవడం వంటి ఫిర్యాదులు ఉన్నతాధికారులకు అందాయి. 

దీనిపై ఎంక్వైరీ చేయగా.. ఆరోపణలు నిజమేనని తేలాయి. అలాగే స్టూడెంట్ల హాజరు విషయంలో కూడా అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో హెచ్‌‌ఎంను సస్పెండ్‌‌ చేస్తూ ఐటీడీఏ పీవో యువరాజ్‌‌ మర్మాట్‌‌ మంగళవారం ఆర్డర్స్‌‌ జారీ చేశారు.