చిన్న రైతుల కోసం ఖేతి అగ్గువ గ్రీన్‌హౌస్‌లు

చిన్న రైతుల కోసం ఖేతి అగ్గువ గ్రీన్‌హౌస్‌లు

హైదరాబాద్‌‌, వెలుగు: గ్రీన్‌‌హౌస్‌‌లు.. తక్కువ వాటర్‌‌‌‌తోనే, పెద్దగా ఎరువులు వాడకుండానే పంటలను పండించొచ్చు ఇక్కడ. పంట దిగుబడి చాలా రెట్లు పెరుగుతుంది కూడా. కానీ, ఈ గ్రీన్‌‌హౌస్‌‌లను రైతులందరూ ఏర్పాటు చేసుకోలేరు. చిన్న రైతులకు కూడా గ్రీన్‌‌హౌస్‌‌లను అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్‌‌ స్టార్టప్‌‌ కంపెనీ ఖేతి. మాన్యుఫాక్చరింగ్‌‌, డిజైన్ కంపెనీలతో పార్టనర్‌‌‌‌షిప్‌‌ కుదుర్చుకొని రూ. లక్ష కంటే తక్కువకే గ్రీన్‌‌హౌస్‌‌ కిట్‌‌లను అందిస్తోంది. వీటిని ఎకరాలో పదోవంతు ప్లేస్‌‌లోనే ఏర్పాటు చేస్తోంది. గ్రీన్‌‌హౌస్‌‌లంటే మొక్కలు పెరగడానికి అనువైన వాతావరణాన్ని క్రియేట్‌‌ చేసే ఓ క్లోజ్డ్‌‌ రూమ్‌‌ టైప్. కంపెనీ తీసుకొచ్చిన ‘గ్రీన్‌‌హౌస్‌‌ ఇన్‌‌ ఏ బాక్స్‌‌’ను  రాష్ట్రంలోని సుమారు 500 మందికి పైగా రైతులు వాడుతున్నారని ఖేతి చెబుతోంది. వీటిని ఏర్పాటు చేసుకున్న రైతులకు ఏ రకం విత్తనాలు, ఎరువులు వాడాలి వంటి సమాచారాన్ని అందిస్తున్నామని తెలిపింది.

ఆదాయం మరింత పెరుగుతుంది..

హైదరాబాద్‌‌కు 60 కి.మీ దూరంలో ఉన్న నారాయణపూర్‌‌‌‌ గ్రామంలో ఖేతి ప్రయాణం స్టార్టయ్యిందని కంపెనీ ఫౌండర్‌‌‌‌ కే. కౌషిక్‌‌ అన్నారు. 2017 లో ప్రారంభమైన ఈ కంపెనీ చిన్న రైతుల ఆదాయం పెంచడంపైనే ఎక్కువ ఫోకస్‌‌ చేసిందని చెప్పారు. ‘వెంకటేష్‌‌, ఆయన భార్య లక్ష్మీ తమకున్న 1.8 ఎకరాలలో వరితో పాటు, కూరగాయలను పండించేవారు. కానీ, వారికి ఏడాదికి వచ్చే ఆదాయం రూ. 30 వేలు కూడా ఉండేది కాదు. వేసవిలో బోర్లు ఎండిపోవడం వంటి కారణాలతో 1.8 ఎకరాలను పూర్తిగా వాడుకోలేకపోయే వారు’ అని ఓ అనుభవాన్ని కౌశిక్ గుర్తు చేశారు. ‘గ్రీన్‌‌హౌస్‌‌లో నాణ్యమైన కూరగాయలను పెద్ద మొత్తంలో పండించే విధాన్ని వెంకటేష్‌‌కు చూపించాం. ఓపెన్‌‌ ఫీల్డ్‌‌లో వాటర్‌‌‌‌ కోసం బోర్లు గంటల కొద్దీ నడవాల్సి ఉంటుంది. కానీ గ్రీన్‌‌హౌస్‌‌లో బోర్లు కేవలం ఐదు నిమిషాలు నడిస్తే చాలు అని వివరించాం. తను గ్రీన్‌‌హౌస్‌‌ను పెట్టుకోవడానికి రెడీ అయ్యాడు’ అని పేర్కొన్నారు. అప్పటికే గ్రీన్‌‌హౌస్‌‌ కాస్ట్‌‌ను రూ. 5 లక్షలకు తగ్గించాం. ఇతర గ్రీన్‌‌హౌస్‌‌లతో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ, వెంకటేష్‌‌ లాంటి రైతులకు ఇది చాలా ఎక్కువ. అందుకే వీటి ధరలను మరింత తగ్గించి, చిన్న రైతుల కోసం అందుబాటు ధరలోకి తీసుకురావాలనుకున్నామని కౌషిక్ పేర్కొన్నారు. గ్రీన్‌‌హౌస్‌‌ల డిజైన్‌‌లకు మార్పులు చేసి ధరలను తగ్గించగలిగామని చెప్పారు. ప్రస్తుతం 400 చదరపు మీటర్లలో గ్రీన్‌‌హౌస్‌‌ను ఏర్పాటు చేయడానికి రూ.80,000 ఖర్చవుతుందని, వీటిలో కీటకాలు రాకుండా అడ్డుకునే నెట్స్‌‌, నీడల కోస నెట్టింగ్‌‌, కీటకాలు, వేడి, అధిక వానల నుంచి పంటలను రక్షించుకునేందుకు పాలీఇథైలిన్‌‌ షీట్స్‌‌ను ఆఫర్ చేస్తున్నామని చెప్పారు. సాధారణంగా ఇలాంటి టైప్‌‌ గ్రీన్‌‌హౌస్‌‌లను ఏర్పాటు చేయడానికి ఎకరాకు(4,047 చ.మీ) రూ. 25 లక్షలు ఖర్చవుతుందని, ఈ రేటుతో పోలిస్తే తక్కువకే ఆఫర్‌‌‌‌ చేస్తున్నామని పేర్కొన్నారు.

ఖేతి ఫౌండర్లు కౌషిక్‌‌, సత్య రఘు.. ఒక ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్ ఫెలోషిప్‌‌ ప్రోగ్రామ్‌‌లో కలిశారు. తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్రలలోని చాలా మంది రైతులతో ఆరు నెలల పాటు చర్చలు జరిపాక ఖేతిని ఏర్పాటు చేశారు. అగ్రికల్చరల్‌‌ ఫైనాన్స్‌‌ స్టార్టప్‌‌ సమున్నతి, బ్యాంక్ ఆఫ్​ బరోడాలతో టై అప్‌‌ అయి, రైతులకు లోన్స్‌‌ ఇప్పిస్తున్నామని కౌషిక్‌‌ అన్నారు. ఎటువంటి కొలేటరల్‌‌ లేకుండానే రైతులకు లోన్లిప్పించడం గొప్ప విషయమని అన్నారు. కానీ, లోన్‌‌ ప్రాసెస్‌‌ స్లోగా నడుస్తోందని పేర్కొన్నారు. అందుకే సరైన ఫైనాన్సింగ్​ మోడల్‌‌ కోసం చూస్తున్నామన్నారు.