భూములమ్మి ఓట్లు కొంటరా?.. ప్రలోభపెట్టి అధికారంలోకి మళ్లీ వస్తరా? : కిషిన్ రెడ్డి

భూములమ్మి ఓట్లు కొంటరా?.. ప్రలోభపెట్టి అధికారంలోకి మళ్లీ వస్తరా? : కిషిన్ రెడ్డి
  • భూములమ్మి ఓట్లు కొంటరా?
  • ప్రలోభపెట్టి అధికారంలోకి మళ్లీ వస్తరా?
  • జాగాలు అమ్ముడు రోజువారీ ప్రోగ్రాం అయ్యింది
  • ‘డబుల్ బెడ్రూం’కు భూమి లేదని ఎందుకంటరు
  • పదెకరాలను కాంగ్రెస్ ఆఫీసుకు ఎలా ఇచ్చిండ్రు
  • అభివృద్ధి పనులకు కేంద్రం స్థలమడిగితే ఇవ్వరేం
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్

బీఆర్ఎస్ సర్కార్ భూములు అమ్మి ఆ డబ్బులతో వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనాలని చూస్తోందని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం (ఆగస్టు 14న) ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. అనేక రాష్ట్రాలు తమ ఆదాయాన్ని పెంచుకుంటుంటే ఇక్కడి ప్రభుత్వం మాత్రం మోసపూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. 

పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు స్థలాలు లేవని చెబుతూనే వేలం పాటల ద్వారా రియల్ ఎస్టేట్ సంస్థలకు సర్కారు జాగాలను అమ్ముకుంటున్నదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణానికి జాగా కావాలని కేంద్ర ప్రభుత్వం తానే స్వయంగా లేఖలు రాసినా రాష్ట్రప్రభుత్వం స్పందించలేదన్నారు.  రైల్వే టెర్మినల్, చర్జపల్లి రైల్వే స్టేషన్ విస్తరణకు స్థలం అడిగితే లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందన్నారు.  ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు కోసం జాగా  అడిగితే కేవలం అర ఎకరం మాత్రమే కేటాయించిందని చెప్పారు. 

రాష్ట్ర ప్రభుత్వం వందల ఎకరాల జాగాలను అమ్మడాన్ని రోజు వారీ కార్యక్రమంగా అమలు చేస్తున్నదని ఆరోపించారు. కోకాపేట, బుద్వేల్, ఖాజాగూడ, మన్నెగూడ, ఆదిబట్ల లాంటి అనేక చోట్ల ప్రభుత్వ భూమిని ఈ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు వేలంలో అమ్ముతోందన్నారు. మూడు నెలల తర్వాత తమ ప్రభుత్వం ఉండదనే తెలిసే ఈ భూముల అమ్మకానికి శ్రీకారం చుట్టిందన్నారు. భూములు అమ్మడం పూర్తిగా అధికార దుర్వినియోగమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు జాగా లేదని చెప్పిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకోసం సర్వే నంబర్ 503లో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని విమర్శించారు.

రాజకీయ పార్టీకి భూమి ఇవ్వడానికి మీకు మనుసు వస్తుంది.. కానీ పేదల ఇండ్ల కోసం ఎందుకు రాదు..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కై.. వందల కోట్ల విలువ చేసే భూములను పార్టీలకు కేటాయింపుల పేరుతో అక్రమంగా తీసుకున్నాయన్నారు. కోకాపేటలో ఎకరం 100 కోట్లు పలుకుతున్నదని, ఇక్కడే  బీఆర్ఎస్ పార్టీ 11 ఎకరాలు తీసుకున్నదని ఫైర్ అయ్యారు.  గతంలో ఫార్మాసిటీ పేరుతో అసైన్డ్ భూములను, పేదల జాగాలను లాక్కొని రియల్ ఎస్టేట్ దందా చేస్తుంటే హైకోర్టు దాన్ని రద్దు చేసిందని చెప్పారు. భూముల అమ్మకం రాష్ట్ర భవిష్యత్ కు మంచిది కాదన్నారు. అధికార పార్టీ దేశమంతా ఇదే పరిస్థితి అవలంబిస్తే పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. భూముల వేలాన్ని బీజేపీ అడ్డుకొని తీరుతుందని చెప్పారు. 

మాజీ ఎమ్మెల్యే జయసుధకు సన్మానం

సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ ఇటీవలే ఢిల్లీలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.. ఆమె ఇవాళ తొలిసారిగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఆమె చేరికను స్వాగతిస్తూ నాయకులు కార్యకర్తలు శాలువకల్పి సన్మానం చేశారు.