తొమ్మిదేండ్లలో 9 లక్షల కోట్లు .. కేంద్రం తెలంగాణకు ఇచ్చింది: కిషన్‌‌రెడ్డి

తొమ్మిదేండ్లలో  9 లక్షల కోట్లు .. కేంద్రం తెలంగాణకు ఇచ్చింది: కిషన్‌‌రెడ్డి
  • రాష్ట్రంలో 31 వేల కోట్లతో రైల్వే పనులు.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది
  • కాచిగూడ టు యశ్వంత్‌‌పూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణకు గత 9 ఏండ్లలో రూ.9 లక్షల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నేషనల్ హైవేల విస్తరణకు రూ. లక్ష 20 వేల కోట్లను ఖర్చు చేసిందని చెప్పారు. రూ.31 వేల కోట్ల రైల్వే పనులు ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్నాయని, ఇందులో రూ.2,300 కోట్లతో స్టేషన్లను పునరుద్ధరిస్తున్నారని తెలిపారు. ఆదివారం కాచిగూడ – యశ్వంత్‌‌పూర్ (బెంగళూరు) మధ్య వందేభారత్ ఎక్స్‌‌ప్రెస్ ట్రైన్‌‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తో కలిసి  కిషన్​రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. 

దేశవ్యాప్తంగా 9 వందేభారత్ ట్రైన్లను ఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రధాని మోదీ ప్రారంభించగా..  కాచిగూడలో కిషన్ రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ ప్రధాని అయ్యాక రైల్వేలో కొత్త శకం ప్రారంభమైందని, దేశంలో అన్ని స్టేషన్లను పునరుద్ధరిస్తున్నారని, ఇందుకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఇటీవల ఒకే సారి వందలాది స్టేషన్లలో రెనోవేషన్ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఒకే రోజు 9 రైళ్లను ప్రధాని ప్రారంభిస్తున్నారని చేప్పారు. తెలంగాణలో సంక్రాంతికి వైజాగ్, ఉగాది సందర్భంగా తిరుపతి ట్రైన్ స్టార్ట్ కాగా, ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా మూడో ట్రైన్‌‌‌‌ను ప్రారంభించారని చెప్పారు.

గ్రూప్ 1 రద్దుకు పూర్తి బాధ్యత కేసీఆర్‌‌‌‌‌‌‌‌దే

గ్రూప్1 పరీక్ష నిర్వహణ విషయంలో టీఎస్​పీఎస్సీ పూర్తిగా విఫలమైందని, పరీక్ష రద్దుకు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌దే అని కిషన్ రెడ్డి ఆరోపించారు. 9 ఏండ్లుగా నిరుద్యోగులకు న్యాయం చేయడం లేదని మండిపడ్డారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. 9 ఏండ్లుగా నిరుద్యోగులు అప్పులు తెచ్చి కోచింగ్ తీసుకుని ప్రిపేర్ అవుతున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాదం రంగారెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.

అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 1, 3 తేదీల్లో రాష్ట్రానికి ప్రధాని

అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 1, 3 తేదీల్లో రాష్ట్రానికి ప్రధాని వస్తున్నారని, కొన్ని రైల్వే పనులకు శంకుస్థాపన చేస్తారని కిషన్‌‌‌‌రెడ్డి వెల్లడించారు. 1వ తేదీన హైదరాబాద్‌‌‌‌లోని బేగంపేటలో సివిల్ ఏవియేషన్‌‌‌‌ రీసెర్చ్ సంస్థను ఓపెనింగ్ చేస్తారని తెలిపారు. తర్వాత పాలమూరులో జరిగే బహిరంగ సభకు హాజరవుతారని వివరించారు. చర్లపల్లిలో రూ.220 కోట్లతో కొత్త టెర్మినల్‌‌‌‌ను రెడీ చేస్తున్నామని, ఈ ఏడాది చివర్లో లేదా జనవరిలో ప్రధాని చేతుల మీదుగా చర్లపల్లి టెర్మినల్‌‌‌‌ను ఓపెన్ చేయిస్తామని చెప్పారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు స్టార్ట్ అయ్యాయని, కొత్త రైల్ లైన్లకు సర్వే జరుగుతున్నదని తెలిపారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుతో పాటు, ఆ రోడ్డు చుట్టూ రైల్ నెట్ వర్క్‌‌‌‌ను అభివృద్ధి చేస్తామన్నారు.