సింగరేణి బీఆర్ఎస్ నాయకుల జేబు సంస్థగా మారిపోయింది : కిషన్ రెడ్డి

సింగరేణి బీఆర్ఎస్ నాయకుల జేబు సంస్థగా మారిపోయింది : కిషన్ రెడ్డి

సింగరేణిలో కేసీఆర్ కుటుంబ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సింగరేణి అధికారులు ఇవాళ చిన్న పనికి కూడా ఎమ్మెల్యేల ఇంటికెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సింగరేణి బీఆర్ఎస్ నాయకుల జేబు సంస్థగా మారిపోయిందని ఆరోపించారు. చివరకు కార్మికుల డ్యూటీ షిప్టింగ్ మార్చాలన్నా అధికార పార్టీ నాయకుల జోక్యం ఎక్కువయిందన్నారు.  సింగరేణి పరిపాలన పూర్తిగా కుప్పకూలే పరిస్థితి ఏర్పడిందని..ఈ సాకుతోనే బీఆర్ఎస్ నాయకులు ప్రైవేటీకరణ అని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

సింగరేణిలో పెరిగిన రాజకీయ జోక్యం

సింగరేణి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.  అంతర్గత ప్రైవేటీకరణ, ఔట్ సోర్సింగ్ అధ్వాన్నమైన ఆర్థిక పరిస్థితి నెలకొందన్నారు.  పరిపాలన పతనం, సింగరేణి సిబ్బందిని గణనీయంగా తగ్గించడం , గనులలో భద్రత లోపించడం, అన్ని వ్యవహారాలల్లో రాజకీయ జోక్యం చేసుకోవడం షరా మామూలైపోయిందని విమర్శించారు.   ఎన్నికలొచ్చినప్పుడే  సీఎం కేసీఆర్ కు   సింగరేణి కార్మికులు గుర్తుకొస్తారని.. వారి జీవితాలు, జీతాల గురించి ప్రస్తావిస్తారు కానీ మళ్లీ వారిని పట్టించుకోరన్నారు. అసెంబ్లీలో, అసెంబ్లీ బయట 2014,2018,2019 ఎన్నికల్లో సింగరేణి కార్మికులందరికీ కేసీఆర్ సొంత ఇల్లు కట్టిస్తామని హామీ ఇంత వరకు నెరవేరలేదన్నారు కిషన్ రెడ్డి. సింగరేణిని దేశమంతా విస్తరిస్తామని ..  ఇతర దేశాల్లో కూడా బొగ్గుగనులను లీజ్ కు తీసుకుంటాం, అంతర్జాతీయంగా సింగరేణిని విస్తరిస్తామని చెప్పిన కేసీఆర్..   తొమ్మిదేళ్లైనా ఆ హామీలు ఎందుకు నెరవేరలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి.  

పర్మినెంట్ ఉద్యోగాల్లో కోత

లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేటువంటి సింగరేణి సంస్థలో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతోందని కిషన్ రెడ్డి తెలిపారు.  కాంట్రాక్ట్ ఉద్యోగులను  పర్మినెంట్ చేస్తానని పట్టించుకోవట్లేదన్నారు. 2014 ఏప్రిల్ లో 62 వేల మంది సింగరేణి కార్మికులు పర్మినెంట్ ఉద్యోగులుగా పనిచేస్తుంటే ఆ సంఖ్య ఇపుడు 43 వేలకు పడిపోయిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం20 వేలఉద్యోగులకు కోత విధించిందని వెల్లడించారు. 2014లో 14 వేల కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే ఆ సంఖ్య ఇపుడు 30 వేలకు పైగా పెరిగిందన్నారు.  16 వేలకు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించుకుని కార్మికుల శ్రమదోపిడి చేస్తుందని విమర్శించారు.  సివిల్, ఎలక్ట్రికల్,శానిటేషన్, నర్సింగ్, వెయికిల్ మెయింటనెన్స్, లోడింగ్, అన్ లోడింగ్ కానీ ట్రాన్స్ ఫోర్ట్  అన్ని ఔట్ సోర్సింగ్ కు ఇచ్చారని చెప్పారు.

సింగరేణికి ప్రభుత్వం 25 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి

 తెలంగాణ ఉద్యమంలో  కేసీఆర్  తెలంగాణను సాధించు..సింగరేణిని రక్షించు నినాదం తీసుకుంటే.. ఇవాళ సింగరేణిని రక్షించే బదులు భక్షించే విధాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి. 2014 లో 3500 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ తో  సింగరేణి కొనసాగేదని... కానీ ఈ రోజు సింగరేణి తీసుకున్నటువంటి అప్పులు ,చెల్లించాల్సిన బకాయిలు 10 వేల కోట్లు దాటిందన్నారు.   సింగరేణికి రావాల్సినటువంటి బకాయిలు  పలు బొగ్గు కొనుగోలుదారుల నుంచి 4 వేల కోట్లు రావాలన్నారు.   టీఎస్ జెన్ కో నుంచి 2600 కోట్లు,  టీఎస్ ట్రాన్స్ కో నుంచి దాదాపు 18 వేల కోట్లు రావాలన్నారు.  బొగ్గుసరఫరా, విద్యుత్ అమ్మకాల ద్వారా గానీ సింగరేణికి  వడ్డీతో కలిపి 25 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచే రావాలన్నారు.  బ్యాంకు బ్యాలెన్స్ తో ఉన్న సింగరేణి ఇవాళ  అప్పులు చేస్తే కానీ కార్మికులకు జీతాలివ్వలేని పరిస్థితి వచ్చిందన్నారు.

బీఆర్ఎస్ నేతల సొంత పనులకు సింగరేణి నిధులు

సీఎస్సార్ పేరు మీద ప్రతి యేటా 230 కోట్లకు మించి బీఆర్ఎస్ నాయకులు తమ ప్రాంతాల్లో సొంత అవసరాలకు వాడుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. డిస్ట్రిక్ట్ మినరల్ ట్రస్ట్   ఫౌండేషన్ కింద బీఆర్ఎస్సోళ్లు 500 కోట్లు ఖర్చు పెట్టించారని తెలిపారు.  సింగరేణి ప్రభావిత నియోజకవర్గాల్లో ప్రతి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు  కోట్లాది రూపాయలు డబ్బుల ప్రత్యక్షంగా పరోక్షంగా ఖర్చు పెట్టిస్తున్నారని వెల్లడించారు.  కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్లు తీసుకుందని వివరించారు.

కోల్ ఇండియా అప్పులు తగ్గుతుంటే సింగరేణి అప్పులు పెరుగుతున్నయ్

2014లో సింగరేణి టర్నోవర్ 12 వేల కోట్లు ఉంటే ఈ రోజు 32,830 కోట్లుగా ఉందని  కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం లాభం 1227 కోట్లేనని వెల్లడించారు. టర్నోవర్ తో 2014 తో పోలిస్తే 3 రెట్లు పెరిగినప్పటకీ లాభాల్లో కనిపించడం లేదని విమర్శించారు.  సింగరేణి కంటే  సీఐఎల్(కోల్ ఇండియా)10 రెట్లు పెద్దదని.. కోల్ ఇండియా అప్పులు 12 వేల కోట్లని.. దీనితో  తో పోలిస్తే సింగరేణి అప్పులు 1200 కోట్లకు  మించకుండా ఉండాలన్నారు.  సీఐఐ అప్పులు రోజు రోజుకు తగ్గుతుంటే బీఆర్ఎస్ పుణ్యమా అని సింగరేణి అప్పులు పెరుగుతున్నయని వెల్లడించారు కిషన్ రెడ్డి.