జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశం.. మేనిఫెస్టోలో పెడ్తాం: కిషన్ రెడ్డి

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశం.. మేనిఫెస్టోలో పెడ్తాం: కిషన్ రెడ్డి
  •     డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగు: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో తమ మద్దతు ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల అంశాన్ని పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) అధ్యక్షుడు బొల్లోజు రవి, ట్రెజరర్ చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్ దండ రామకృష్ణ, సలహాదారు కె.విక్రమ్ రెడ్డి తదితరులు బీజేపీ స్టేట్ ఆఫీస్​లో కిషన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఇది న్యాయబద్ధమైన డిమాండ్‌‌ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. 

ఈ సందర్భంగా కిషన్‌‌ రెడ్డికి డీజేహెచ్ఎస్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. తర్వాత డీజేహెచ్ఎస్ అధ్యక్షుడు బొల్లోజు రవి మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు వారు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల ఇంటి స్థలాల అంశాన్ని పొందుపరచాలని కోరినట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీలను కలిసి మేనిఫెస్టోలో జర్నలిస్టుల ఇండ్ల అంశం చేర్చాలని డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కోరుతున్నది.