ఆర్టీసీ కార్మికులతో పెట్టుకొని సీఎం కేసీఆర్ చాలా తప్పు చేస్తున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. లక్ష్మణ్. మొండివైఖరితో తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నారని విమర్శించారు. మంగళవారం సూర్యాపేటలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన లక్ష్మణ్.. ఆర్టీసీ సమ్మె చేస్తున్న ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారని కేసీఆర్ అనడాన్ని తప్పుపట్టారు. ప్రజలే కేసీఆర్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తారని హెచ్చరించారు. హుజూర్నగర్ ఎన్నికల కోసమే కేకే చర్చల డ్రామా ప్రారంభించారని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఇన్ని రోజులు దసరా సెలవులు ఇచ్చిన ప్రభుత్వమే లేదన్నారు. TRS మెడలు వంచే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు లక్ష్మణ్.


