విజయంతో ముగింపు.. 40 రన్స్‌‌ తేడాతో కోల్‌‌కతాపై ఢిల్లీ గెలుపు

విజయంతో ముగింపు.. 40 రన్స్‌‌ తేడాతో కోల్‌‌కతాపై ఢిల్లీ గెలుపు
  • రాణించిన రాహుల్‌‌, అక్షర్‌‌, కుల్దీప్‌‌, ఎంగిడి
  • రహానె ఒంటరి పోరాటం వృథా

కోల్‌‌కతా: ఐపీఎల్‌‌–19ను ఢిల్లీ క్యాపిటల్స్‌‌ విజయంతో ముగించింది. బ్యాటింగ్‌‌లో కేఎల్‌‌ రాహుల్‌‌ (60), అక్షర్‌‌ పటేల్‌‌ (39)కు తోడు ఎంగిడి (3/27), కుల్దీప్‌‌ యాదవ్‌‌ (3/29) బౌలింగ్‌‌లో చెలరేగడంతో.. ఆదివారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఢిల్లీ 40 రన్స్‌‌ తేడాతో కోల్‌‌కతాపై గెలిచింది. టాస్‌‌  ఓడిన ఢిల్లీ 20 ఓవర్లలో 203/5 స్కోరు చేసింది. అభిషేక్‌‌ పోరెల్‌‌ (22)తో తొలి వికెట్‌‌కు 40 రన్స్‌‌ జోడించిన రాహుల్‌‌.. సాహిల్‌‌ పారక్‌‌ (24)తో రెండో వికెట్‌‌కు 47, అక్షర్‌‌ పటేల్‌‌తో మూడో వికెట్‌‌కు 38 రన్స్‌‌ జోడించి ఔటయ్యాడు. 

125/3తో నిలిచిన ఢిల్లీని అక్షర్‌‌ ముందుకు తీసుకెళ్లాడు. మిడిలార్డర్‌‌లో డేవిడ్‌‌ మిల్లర్‌‌ (28) అండగా నిలిచాడు. నాలుగో వికెట్‌‌కు 41 రన్స్‌‌ జత చేసి అక్షర్‌‌ వెనుదిరిగినా.. చివర్లో అశుతోష్‌‌ శర్మ (18 నాటౌట్‌‌) ధనాధన్‌‌ షాట్లతో రెచ్చిపోయాడు. మిల్లర్‌‌తో కలిసి ఐదో వికెట్‌‌కు 35 రన్స్‌‌ జోడించడంతో డీసీ భారీ స్కోరు చేసింది.

సౌరభ్‌‌ దూబే 2, అనుకుల్‌‌ రాయ్‌‌, నరైన్‌‌, వరుణ్‌‌ తలా ఒక్క వికెట్‌‌ తీశారు. ఛేజింగ్‌‌లో కోల్‌‌కతా 18.4 ఓవర్లలో 163 రన్స్‌‌కే ఆలౌటైంది. స్టార్టింగ్‌‌ నుంచి నిలకడగా ఆడిన రహానె కీలక భాగస్వామ్యాలు అందించాడు. ఫిన్‌‌ అలెన్‌‌ (20), మనీష్‌‌ పాండే (25), గ్రీన్‌‌ (2)తో కలిసి 128 రన్స్‌‌ జత చేశాడు. 

పావెల్‌‌ (28) నిలకడగా ఆడినా.. వరుస విరామాల్లో రింకూ సింగ్‌‌ (0), తేజస్వి దహియా (1), అనుకుల్‌‌ రాయ్‌‌ (9), కార్తీక్‌‌ త్యాగీ (0), వరుణ్‌‌ చక్రవర్తి (5) ఔట్‌‌ కావడం  కేకేఆర్‌‌ను దెబ్బతీసింది. ఇన్నింగ్స్‌‌లో ఏడుగురు సింగిల్‌‌ డిజిట్‌‌ స్కోరుకే పరిమితం కావడంతో కోల్‌‌కతాకు ఓటమి తప్పలేదు. స్టార్క్‌‌ 2 వికెట్లు తీశాడు. కుల్దీప్‌‌ యాదవ్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.

సంక్షిప్త స్కోర్లు

  • ఢిల్లీ: 20 ఓవర్లలో 203/5 (రాహుల్‌‌ 60, అక్షర్‌‌ 39, సౌరభ్‌‌ దూబే 2/28).
  • కోల్‌‌కతా: 18.4 ఓవర్లలో 163 ఆలౌట్‌‌ (రహానె 63, పావెల్‌‌ 29, కుల్దీప్‌‌ 3/29, ఎంగిడి 3/27).