
టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులోనూ రాహుల్ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 17 పరుగులకే చేసిన రాహుల్...రెండో ఇన్నింగ్స్లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవీలియన్ చేరాడు.
ఒత్తిడిలో రాహుల్...
115 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేఎల్ రాహల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తీవ్ర ఒత్తిడిలో కనిపించాడు. నాథన్ లయన్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికే రాహుల్ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రాహుల్ ఆడిన బంతి... షాట్ షార్ట్ లెగ్ ఫీల్డర్ తాకి గాల్లోకి లేవగా.. కీపర్ అలెక్స్ కేరీ దాన్ని ఒడిసిపట్టుకున్నాడు.
విఫలం..
కేఎల్ రాహుల్ గత 47 ఇన్నింగ్స్లో 26.15 సగటుతో 1203 పరుగుల మాత్రమే చేశాడని, ఇందులో మూడు సెంచరీలు, హాఫ్ సెంచరీలు ఉండగా... ఐదు సార్లు డకౌటయ్యాడు.
రాహుల్ టెస్ట్ కెరీర్లో 17 సార్లు సింగిల్ డిజిట్ కే ఔటయ్యాడు. 2022 జనవరి నుంచి టెస్టుల్లో ఒక్క ఇన్నింగ్స్లో కూడా 25+ స్కోరు నమోదు చేయలేకపోయాడు.
ఫ్యాన్స్ ఆగ్రహం..
రెండో టెస్టులోనూ కేఎల్ రాహుల్ విఫలమవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై వేటు వేయాలని కోరుతున్నారు. రాహుల్ను జట్టు నుంచి తొలగించి దేశవాళీ ఆడించాలంటున్నారు. ఫాంలో ఉన్న గిల్ను కాదని విఫలమవుతున్న రాహుల్ను ఎందుకు ఆడిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
వేటు వేయాల్సిందే..
శిఖర్ ధావన్కి టెస్టుల్లో 40+ యావరేజ్ ఉండగా..., మయాంక్ అగర్వాల్ రెండు డబుల్ సెంచరీలతో 41+ యావరేజ్తో పరుగులు సాధించాడు. అయినా సెలక్టర్లు పట్టించుకోవడం లేదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వన్డేల్లో డబుల్ సెంచరీ, టీ20ల్లో సెంచరీలు బాదుతూ బీభత్సమైన ఫామ్లో ఉన్న శుబ్మన్ గిల్ ను పక్కనబెట్టి అవకాశం ఇచ్చినా ప్రయోజనం లేదంటున్నారు. దీనికి తోడు దేశవాళీల్లో సర్ఫరాజ్ ఖాన్ బ్రాడ్మెన్ రికార్డులను చెరిపేస్తున్నా.. సెలక్టర్లు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అతనిపై వేటు వేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.