మీకు వచ్చే మొబైల్ మెసేజ్‌లు మారిపోయాయి.. కొత్త రూల్స్ తెలుసుకోండి.. లేకపోతే మోసపోతారు..!

మీకు వచ్చే మొబైల్ మెసేజ్‌లు మారిపోయాయి.. కొత్త రూల్స్ తెలుసుకోండి.. లేకపోతే మోసపోతారు..!

దేశంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. పాల ప్యాకెట్ నుంచి ఇంటి అద్దె వరకు ఏ చెల్లింపు చేయాలన్నా ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా కూడా ఫోన్ తప్పనిసరిగా మారింది. దీంతో నేరగాళ్లు మెుబైల్ ఫోన్ నంబర్లను దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేయటానికి కొత్త మార్గాలను కనుక్కున్నారు. అయితే ప్రస్తుతం వీటిని అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ రంగంలోకి దిగింది. 

కొందరు నేరగాళ్లు అసలైన సంస్థల మాదిరిగా ఫేక్ మెసేజ్ లను పంపుతూ వాటిలో ఫిషింగ్ లింక్స్ లేదా ఏపీకే ఫైల్స్ లింక్స్ పంపిస్తూ డబ్బు కాజేస్తున్న ఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి. కేవైసీ అప్ డేట్, ఆథార్ అప్ డేట్, బ్యాంక్ ఖాతా వివరాలు అప్ డేట్, రైతు బంధు అంటూ ఇలా కొత్తకొత్త పేర్లతో మెసేజ్ లను పంపుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తూ వారి డబ్బు, సమాచారాన్ని దోచేస్తున్నారు.

అందుకే ప్రజలు ఏ మెసేజ్ నిజమైంది, ఏది ఫేక్ అనే తేడాలను గమనించటం కోసం ఇటీవల ట్రాయ్ కొత్త మెసేజింగ్ మార్గదర్శకాలను అమలులోకి తీసుకొచ్చింది. దీని కింద అధికారిక సంస్థల నుంచి వచ్చిన మెసేజ్‍‌లలో చివర కొన్ని ఇంగ్లీష్ అక్షరాలను సూచికలుగా వినియోగించింది. ప్రతి మెసేజ్ వెనుక P, S, T, G అనే అక్షరాలను ఇందుకోసం ఉపయోగించారు. అక్షరాన్ని బట్టి వచ్చిన మెసేజ్ ఏ కేటగిరీకి చెందినదనే వివరాలను ప్రాథమికంగా గుర్తించవచ్చు.

• P - Promotional(అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రమోషన్ మెసేజ్ సూచిక)
• S - Service(బ్యాంక్ లేదా ఇతర సంస్థల నుంచి పొందే సేవలను ఇది సూచిస్తుంది)
• T - Transactional(ఏదైనా డబ్బు, కార్డు చెల్లింపుల సమయంలో వచ్చే మెసేజ్ సూచిక)
• G - Government(కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే మెసేజ్ సూచిక)

అయితే కొంత మంది వినియోగదారులు మాత్రం సోషల్ మీడియాలో తమకు ప్రమోషనల్ మెసేజ్ లు ఇప్పటికీ సర్వీస్ కేటగిరీ కింద ఉన్నాయని చెబుతున్నారు. మెుత్తానికి కొత్తగా వచ్చిన విధానం గురించి ప్రజలు తెలుసుకుని అప్రమత్తంగా ఉండటం ముఖ్యం అని సైబర్ నిపుణులు చెబుతున్నారు.