
- రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి
- ప్రశ్నించిన వారిపై కేంద్ర సంస్థలను ఉసిగొల్పుతున్నారు
- ఇందిరా గాంధీపై దుష్ర్పచారం చేస్తున్నారని ఫైర్
- సంస్కరణలపై దృష్టి పెట్టాలని హితవు
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని మండిపడ్డారు. గురువారం బీఆర్కే భవన్లో రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, రాంరెడ్డి గోపాల్ రెడ్డితో కలిసి మీడియాతో కోదండ రెడ్డి మాట్లాడారు. ప్రశ్నించిన వారిపై ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను ఉసిగొల్పుతున్నారని ఆయన విమర్శించారు.
బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజాస్వామ్యవాదులు గుర్తించాలని పిలుపునిచ్చారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీని బీజేపీ నేతలు బద్నాం చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఆమె బలమైన నాయకత్వం, సంస్కరణలను ప్రపంచమే గుర్తించిందని తెలిపారు. ఇందిరా హయాంలో బ్యాంకుల జాతీయకరణ, పేదలకు భూముల పంపిణీ వంటి సంస్కరణలు ఆమె పాలనలోనే జరిగాయని గుర్తుచేశారు. బీజేపీ చౌకబారు రాజకీయాలు మాని, సంస్కరణలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రైతుల ఉద్యమం కారణంగానే వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. అయితే, ఇప్పటికీ ఆ చట్టాలను ఉపసంహరించినట్లు పార్లమెంటులో ప్రకటించలేదని కోదండరెడ్డి పేర్కొన్నారు.
అదానీ, అంబానీకి హర్యానా, పంజాబ్లో 800 ఎకరాల భూమిని అప్పగించి, ఆహార ధాన్యాల నిల్వలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీసీఐ పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తామని మోదీ ప్రకటించారు. ఇది రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది’’ అని కోదండ రెడ్డి పేర్కొన్నారు. జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు రైతు సంక్షేమ చట్టాలు తెచ్చారని, బీజేపీ మాత్రం అన్ని రంగాలను నాశనం చేసిందని విమర్శించారు. ఇకబీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ను, రైతుబంధు పథకాన్ని ఓట్ల కోసం దుర్వినియోగం చేసిందని ఆయన మండిపడ్డారు.