కేసీఆర్ కాదు.. మునుగోడు ప్రజలు అనుకుంటే ఉప ఎన్నిక వస్తది

కేసీఆర్ కాదు.. మునుగోడు ప్రజలు అనుకుంటే ఉప ఎన్నిక వస్తది

మునుగోడు ఉప ఎన్నిక రావడం పక్కా అని ఎమ్మెల్యే  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంకేతాలిచ్చారు. మునుగోడుకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. మునుగోడు ప్రజలు నిర్ణయించిన తర్వాత యుద్ధం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ కోరుకుంటే కాదు.. మునుగోడు ప్రజలు కోరుకుంటే ఉప ఎన్నిక వస్తదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ అన్నారు.. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగానే తన పోరాటమని చెప్పారు. అధికార టీఆర్ఎస్ నేతలు ప్రతిపక్ష ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారని రాజగోపాల్ మండిపడ్డారు. తాను చేయబోయే యుద్ధం పార్టీల మధ్య కాదని, ప్రజలు కేసీఆర్ కు మధ్య జరిగే యుద్ధమని అన్నారు. మునుగోడు ప్రజలు నిర్ణయించిన తర్వాతే యుద్ధం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. అభివృద్ధి కేవలం సిరిసిల్ల, సిద్ధిపేటకే పరిమితమైందన్న రాజగోపాల్.. హుజూరాబాద్లో పోయిన పరువును ప్రలోభాలతో కాపాడుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. ఉప ఎన్నిక వస్తే తెలంగాణ రాజకీయాలు మారిపోతాయని అన్నారు.

ఇదిలా ఉంటే  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ నేతల చర్చలు విఫలమయ్యాయి. ఏఐసీసీ దూతలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీచంద్ రెడ్డిలు రాజగోపాల్ రెడ్డితో భేటీ అయినా ఫలితం లేకుండా పోయింది. రాహుల్ మాటగా ఢిల్లీ రావాలని, పార్టీ మార్పుపై తొందరపాటు నిర్ణయంతీసుకోవద్దని ఇరువురు నేతలు కోరినట్లు తెలుస్తోంది. అయితే వారి విజ్ఞప్తిని రాజగోపాల్ తోసిపుచ్చినట్లు సమాచారం. తాను ఢిల్లీకి  స్పష్టం చేసిన రాజగోపాల్ అవసరముంటే తన వద్దకే వచ్చి మాట్లాడాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఏఐసీసీ దూతలుగా వచ్చిన ఉత్తమ్, వంశీచంద్ లు నిరాశతో వెనుదిరిగినట్లు సమాచారం.