ఓడిపోతాననే భయంతో కాంగ్రెస్ లో చేరిండు

ఓడిపోతాననే భయంతో కాంగ్రెస్ లో చేరిండు

శంషాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కార్ లో అక్రమాలు చేశాడని ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు విమర్శించి, ఆపై పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఆయన గురువారం జయ సంకల్పయాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా రాయన్న గూడ, నానాజీపూర్, జూకల్ షాపూర్,  షాపూర్ తండా, మదనపల్లి,  పెద్ద తుప్పర లో  ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా ఆయనకు మహిళలు హారతులతో, డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. 

అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ రంజిత్ రెడ్డి కోళ్ల దాణా, గుడ్ల స్కాం చేశాడని గతంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడారని ఆయన గుర్తుచేశారు. రామానాయుడు స్టూడియో హనుమాన్ ఆలయ స్థలం కబ్జా చేసి విల్లాస్ కట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందని, మరోసారి సర్వే చేసుకుని ఓడిపోతాననే భయంతో కాంగ్రెస్ లో చేరాడని విమర్శించారు.  ప్రతి ఒక్కరూ ప్రధాని మోదీని చూసి ఓటు వేయాలని, ప్రపంచంలో 24 గంటలు ప్రజాసేవకే కృషి చేసే నేత అని తెలిపారు. 

కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ప్రజలు నమ్మట్లేదని చెప్పారు. బూత్ స్థాయి నేతలు, కార్యకర్తలు సైనికులుగా పని చేసి చేవెళ్ల లో పార్టీని గెలిపించి ప్రధాని మోదీకి గిఫ్ట్ గా ఇద్దామని పిలుపునిచ్చారు. అనంతరం జూకల్ లో బీజేపీ ఆఫీస్ ను ఓపెన్ చేశారు.  ఈ సమావేశంలో ఏనుగు మదన్ మోహన్ రెడ్డి , ఏనుగు వేణు రెడ్డి, మాజీ సర్పంచ్ అనిత సంజీవ, రాళ్ల బండి ప్రసాద్, మహేందర్ రెడ్డి ఏటిగడ్డ సమ్మెట సాయికుమార్, వినోద్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.