- కొండాపూర్ జాయకా రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల రైడ్
- ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ రద్దు
గచ్చిబౌలి, వెలుగు: కొండాపూర్ ఏఎంబీ మాల్ ఎదురుగా ఉన్న జాయకా ఫుడ్ కోర్టులో సైబరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. గురువారం వారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పనిచేయని ఫ్రీజర్లో ఆహార పదార్థాలను నిల్వ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
రెస్టారెంట్ కిచెన్లో ఎలుకల బెడద, ఎలుకల బొరియలు, ఎలుకలు కొరికిన ఆహార పదార్థాలు చూసి అధికారులు షాకయ్యారు. ముడి పదార్థాలు, ప్యాకేజింగ్ నిల్వ చేసే ప్రదేశాల్లో ఎలుకల రెట్టలు కనిపించాయి. ఫ్రీజర్లో పాచిపోయిన చికెన్ బిర్యానీ, పాడైపోయిన కూరగాయలను నిల్వ చేశారు.
రెస్టారెంట్ నిర్వాహకులపై అధికారులు సీరియస్ అయ్యారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు రెస్టారెంట్ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ను సస్పెండ్ చేశారు. లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశాలు జారీ చేశారు.
