న్యూఢిల్లీ: భారత్లో ఎమర్జెన్సీ విధించి 50 ఏండ్లు పూర్తయిన నేపథ్యంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఆర్టీ) కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా 9వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో ఎమర్జెన్సీని పాఠ్యాంశంగా చేర్చింది. ‘‘అండర్స్టాండింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్’’ పేరుతో రూపొందించిన కొత్త పాఠ్యపుస్తకంలో భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా ఎమర్జెన్సీని అభివర్ణించింది.
భారత్లో ప్రజాస్వామ్య బలాలు, సవాళ్లపై చర్చించే అధ్యాయంలో ఈ అంశాన్ని చేర్చారు. ‘అంతర్గత కల్లోలాల నెపంతో 1975 జూన్లో ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీ విధించింది. ఈ కాలంలో ప్రాథమిక హక్కులను రద్దు చేశారు. పత్రికలపై సెన్సార్షిప్ విధించారు. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలను అరెస్టు చేశారు. దీనివల్ల ప్రజాస్వామ్య సంస్థలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. పౌరుల స్వేచ్ఛ హరించుకుపోయింది’ అని ఒక పేరాలో వివరించారు. తన ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పివ్వడంతో ఇందిరా గాంధీ 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించారు.
జేపీ గురించి ప్రత్యేక ప్రస్తావన
ఎమర్జెన్సీ విధింపుకు దారితీసిన పరిస్థితులు, ప్రజాస్వామ్య హక్కులపై దాని ప్రభావాన్ని ఈ పాఠ్యాంశంలో చర్చించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ప్రజాఉద్యమంలో లోక్ నాయక్గా పేరుగాంచిన రాజకీయ నాయకుడు, సోషలిస్ట్ మేధావి జయప్రకాశ్ నారాయణ్(జేపీ) పోషించిన పాత్రను కూడా హైలైట్ చేశారు.
