కేటీఆర్ సెల్‌‌ఫోన్లు ఏసీబీకి ఇస్తరా.. లేదా!

కేటీఆర్ సెల్‌‌ఫోన్లు ఏసీబీకి ఇస్తరా.. లేదా!
  • ఫోన్లు, ల్యాప్‌‌ట్యాప్‌‌ను గురువారంలోగా అప్పగించాలని ఆదేశం
  • న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్న కేటీఆర్‌‌‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ఫార్ములా-ఈ  రేసు కేసులో బీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌, మాజీ మంత్రి కేటీఆర్‌‌‌‌ తన సెల్‌‌ఫోన్లు, ల్యాప్‌‌టాప్‌‌లు ఏసీబీకి అప్పగించే అంశంలో ఉత్కంఠ నెలకొంది. సెల్‌‌ఫోన్లు, వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలను దర్యాప్తు అధికారులు బలవంతంగా తీసుకోవద్దని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అలాగే న్యాయనిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. దీంతో ఏసీబీ అధికారులు కోరినట్టుగా కేటీఆర్‌‌ సెల్‌‌ఫోన్లు ఇస్తారా? లేదా? అన్నది స్పష్టత రాలేదు.

దర్యాప్తులో భాగంగా సోమవారం విచారణకు హాజరైన కేటీఆర్ సెల్‌‌ఫోన్లు స్వాధీనం చేసుకునేందుకు ఏసీబీ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. కేటీఆర్‌‌ ఏ-1గా ఉన్నందున ఆధారాల సేకరణలో సెల్‌‌ఫోన్లు కీలకమని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌ నిర్వాహకులతో జరిపిన సం‍ప్రదింపులు, ఇతర చర్చలకు సంబంధించిన వివరాల కోసం తన సెల్‌‌ఫోన్‌‌ వాడినట్టు కేటీఆర్‌‌ చెప్పినట్టు సమాచారం. దీంతో తగిన ఆధారాల కోసం 2021 జనవరి నుంచి 2023 డిసెంబర్‌‌ వరకు వినియోగించిన సెల్‌‌ఫోన్లు, ల్యాప్‌‌టాప్‌‌లను బుధవారంలోగా అందజేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.