
హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేస్ కేసును ఆరు నెలలుగా విచారించి ఇప్పటి వరకు ఏమి తేల్చదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి పైశాచికానందం పొందతోందని విమర్శించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సోమవారం (జూన్ 16) కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. విచారణకు బయలుదేరే ముందు హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికీ మూడు సార్లు విచారణకు పిలిచారాని.. 3 సార్లు కాదు 30 సార్లు పిలిచిన వస్తానని అన్నారు. ఈ కేసులో తనని అరెస్ట్ చేసినా చేయొచ్చని.. దైనికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. జైలుకు వెళ్లడం తమకు కొత్తకాదని.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కూడా ఎన్నోసార్లు జైలుకెళ్లామని గుర్తు చేశారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. విచారణలు, కమిషన్లు, రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేదేలేదని ఆరు గ్యారెంటీల మోసాన్ని ఎండబెట్టడంలో ఇవేవీ మమ్మల్ని ఆపలేవని అన్నారు.
ఎన్ని కుట్రలు చేసిన ప్రజలకు కాంగ్రెస్ చేసిన దగాను ఎండగడుతూనే ఉంటామన్నారు. విచారణలు, ప్రతీకార చర్యలకు ఎప్పటికీ నిరుత్సాహపడనని.. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే ఉంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి చెప్పుకోవడానికి ఏం లేకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్తో హైదరాబాద్ సిటీ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగిందనిపునరుద్ఘాటించారు. తెలంగాణకు బీఆర్ఎస్సే- శ్రీరామరక్ష అని అన్నారు.
కాగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మంగా నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్లో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతో 55 కోట్ల రూపాయలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు తరలించారని ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ ఏ2, బీఎల్ ఎన్ రెడ్డిని ఏ3 నిందితులుగా ఏసీబీ చేర్చింది. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ విచారించింది. ఇదే కేసులో మరోసారి విచారణకు హాజరుకావాలని కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 2025, జూన్ 16న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఏసీబీ నోటీసుల మేరకు సోమవారం కేటీఆర్ విచారణకు హాజరయ్యారు.