వెయ్యి కోట్లు ఇవ్వు.. నా ఆస్తులన్నీ ఇచ్చేస్త..రేవంత్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడ్త

వెయ్యి కోట్లు ఇవ్వు.. నా ఆస్తులన్నీ ఇచ్చేస్త..రేవంత్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడ్త
  • రేవంత్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడ్త: కేటీఆర్ 
  • రూ.లక్ష కోట్లలో మిగిలిన రూ.99 వేల కోట్లతో హామీలు అమలు చెయ్
  • కాళేశ్వరం మాదిరిగానే కేసీఆర్ ఆస్తులపైనా విషం చిమ్ముతున్రు
  • ఎన్ని కేసులు పెట్టుకుంటవో పెట్టుకో.. నువ్వేమీ చేయలేవ్
  • హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు పేరు తెచ్చే ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తే కేసులు పెట్టారు
  • నాంపల్లి కోర్టు వద్ద మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్

 


 
హైదరాబాద్, వెలుగు: వెయ్యి కోట్లు ఇస్తే తన ఆస్తులన్నీ ఇచ్చేస్తానని.. సీఎం రేవంత్​ ఎక్కడ సంతకం పెట్టుమంటే అక్కడ పెడ్తానని బీఆర్​ఎస్​ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​అన్నారు. ‘కేసీఆర్​ కుటుంబం 400 ఎకరాల భూములతో రూ.లక్ష కోట్లు కొల్లగొట్టిందని సీఎం రేవంత్​ రెడ్డి చెబుతున్నారు.. రేవంత్​కు ఓ బంపర్​ ఆఫర్​ ఇస్తున్నా. ఆయన అంటున్న రూ.లక్ష కోట్లలో రూ.వెయ్యి కోట్లు తనకు ఇస్తే ఆ భూములు మొత్తం రాసిచ్చేస్తా. రేవంత్​ ఎక్కడ సంతకం పెట్టుమన్నా పెడతా.. ’ అని   సవాల్​ విసిరారు. రూ.వెయ్యి కోట్లు ఇచ్చాక.. లక్ష కోట్లలో మిగిలిన రూ.99 వేల కోట్లతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్​ చేశారు. రైతు భరోసా, మహిళలకు నెలకు రూ.2,500, తులం బంగారం, ఫీజు రీయింబర్స్​మెంట్, దళితబంధు, గిరిజనబంధు పథకాలను అమలు చేసి చూపించాలన్నారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్​ను, బీఆర్​ఎస్​ పార్టీ నాయకులను టార్గెట్​ చేయడమే పనిగా పెట్టుకున్నారని కేటీఆర్​ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే లక్ష్యానికి బదులు కేవలం ప్రతిపక్షాలనే టార్గెట్​ చేసుకున్నదన్నారు.  ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారంలో శుక్రవారం నాంపల్లి కోర్టు వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.  

అప్పట్లో ఎకరం రూ.5లక్షలే.. 

కాళేశ్వరం ప్రాజెక్టు రూ.లక్ష కోట్లంటూ విష ప్రచారం చేశారని, ఇప్పుడు తమ భూముల విషయంలో అదే స్థాయిలో కేసీఆర్​పై విషం చిమ్ముతున్నారని కేటీఆర్​ మండిపడ్డారు. హైదరాబాద్​కు 75 కిలోమీటర్ల దూరంలోని ఎర్రవల్లిలో 20 ఏండ్ల క్రితం కేసీఆర్​ భూములు కొన్నారని, అప్పుడు ఎకరం రూ.5 లక్షలే ఉందని గుర్తు చేశారు. పదివేల ఎకరాలు కేసీఆర్​ కబ్జా చేశారంటూ ఎన్నోసార్లు రేవంత్​ ఆరోపించారని, వెయ్యి ఎకరాల ఫాంహౌస్​ అంటూ మాట్లాడారని మండిపడ్డారు. కానీ, అసెంబ్లీలో 67 ఎకరాలేనని రేవంతే స్వయంగా చెప్పారని పేర్కొన్నారని.. మరి, మిగతా 933 ఎకరాలు ఎటు పోయాయని రేవంత్​ను కేటీఆర్​ ప్రశ్నించారు. ముందు కేసీఆర్​కు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. 

22ఏ నుంచి దృష్టి మళ్లించేందుకే..

పేదల భూములను 22ఏలో పెట్టి 30 శాతం కమీషన్లు దండుకుంటున్నారని కేటీఆర్​ ఆరోపించారు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రేవంత్​ ఈ భూముల డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ‘‘ఎన్ని కేసులు పెట్టుకుంటవో పెట్టుకో.. ఎన్ని కమిషన్లు వేస్తవో వేసుకో.. ఏం చేసుకుంటవో చేసుకో.. నువ్వు ఏమీ చేయలేవు అని ప్రజలకు అర్థమైంది. పోలీసులు వేధిస్తున్నా.. పోలీసుస్టేషన్​లోనే మాపై దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలే.. న్యాయస్థానాలు అండగా నిలిచినయ్.​. హైదరాబాద్​కు పేరు తెచ్చే ఫార్ములా ఈ రేస్​ను తీసుకొచ్చాం. కానీ, ఆ రేసులో ఏదో జరిగిపోయిందని ఆరోపిస్తూ నాపై కేసు పెట్టారు. అయినా సరే ఎదుర్కొంటం. ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగానే ఫార్ములా ఈ రేస్  నిర్వహించినం. తమిళనాడు సీఎం విజయ్​ ఇటీవల మోటార్​ స్పోర్ట్​ రేసింగ్​ కోసం లండన్​ పోయిండు.. పెట్టుబడులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నరు.. అదే ప్రయత్నం మేం చేసినం. కానీ, మా మీద కేసులు పెట్టి వేధిస్తున్నరు. కోర్టుకు ఇప్పటికే రెండు సార్లు వచ్చిన. ఎన్నిసార్లు పిలిచినా వస్తా. విచారణకు సహకరిస్తా’’ అని కేటీఆర్ చెప్పారు.

రాహుల్​.. ఇదేనా మీ ప్రేమ దుకాణం?

రాజ్యాంగం పట్టుకుని రాహుల్​ గాంధీ పదే పదే వేదాలు వల్లిస్తుంటారని, మాట్లాడే స్వేచ్ఛ గురించి చెబుతుంటారని కేటీఆర్​అన్నారు. ప్రేమ దుకాణమంటూ రాహుల్​ రాజకీయాల గురించి చెప్తే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని ఎక్స్​ పోస్టులో పేర్కొన్నారు. పోలీసులు తమ పార్టీ నేత క్రిశాంక్​ ఇంటి తలుపులు బద్దలుకొట్టి ప్రవేశించారని, ప్రభుత్వాన్ని సోషల్​ మీడియాలో విమర్శించినందుకు అరెస్ట్​ చేశారని విమర్శించారు. సోషల్​ మీడియా పోస్టుల ఆధారంగా అరెస్టులు చేయొద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టంగా ఆదేశాలిచ్చినా.. రేవంత్​ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా అని నిలదీశారు. దీనికి రాహుల్​ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. కాగా, దానం నాగేందర్​ అనర్హత వేటుపైనా ఆయన స్పందించారు. పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలకు ఇదే గతి పడుతుందన్నారు. హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.