దొంగ ఓట్లను నమ్ముకునిఎన్నికల్లో పోటీ చేస్తున్నరు..కాంగ్రెస్, బీజేపీపై కేటీఆర్ ఫైర్ 

దొంగ ఓట్లను నమ్ముకునిఎన్నికల్లో పోటీ చేస్తున్నరు..కాంగ్రెస్, బీజేపీపై కేటీఆర్ ఫైర్ 
  • మహిళలను లక్షాధికారులను చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ 

పరిగి, వెలుగు: కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దొంగ ఓట్లను నమ్ముకుని ఎన్నికల్లో పోటీ చేస్తాయని బీఆర్ఎస్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ విమర్శించారు. బెంగాల్​లో 95 లక్షల ఓట్లు తొలగించారని.. గల్లంతైన తమ ఓట్ల కోసం ఓటర్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 1.67 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని రేవంత్​ రెడ్డికి కేటీఆర్ సవాల్​విసరారు. శుక్రవారం పరిగిలో జరిగిన సర్ అవగాహన కార్యక్రమానికి కేటీఆర్ ​చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్దండపూర్ ​నుంచి బీఆర్ఎస్ ​హయాంలో కాలువ తవ్వితే గ్రావిటీ ద్వారా  పరిగి, కోడంగల్ ​నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందన్నారు. కమీషన్లు, కుటుంబ సంపాదన కోసం రూ.4400 కోట్లు పెట్టి సీఎం లిఫ్ట్​ పెట్టారని విమర్శించారు. ఫీజు​ రీయింబర్స్​మెంట్​రూ.12 వేల కోట్లు చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని వివరించారు. 

ఇచ్చిన 420 హామీలు నెరవేర్చట్లేదు

కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాక ముందు 420 హామీలు ఇచ్చిందని.. ఇప్పుడు వాటిని నెరవేర్చడంలో విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. అసైన్డ్​భూములకు పట్టాలిస్తామని చెప్పి.. ఇప్పుడు పేదల భూములను ఇండస్ట్రియల్​ పేరుతో  గుంజుకుంటున్నారని తెలిపారు.  ఎన్నికలెప్పడు వచ్చినా గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. సర్​ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బీఆర్ఎస్​ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డి, మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.