ఆ యూట్యూబ్ ఛానళ్లపై పరువు నష్టం కేసులు పెడతాం: కేటీఆర్

ఆ యూట్యూబ్ ఛానళ్లపై పరువు నష్టం కేసులు పెడతాం: కేటీఆర్

బీఆర్ఎస్ పై అసత్య ప్రచారం చేయడంతోపాటు.. పార్టీపై ప్రజలను అయోమయానికి గురిచేసేందుకు కొన్ని యూట్యూబ్ చానళ్లు కుట్ర చేస్తున్నాయని ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి యూట్యూబ్ చానళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ.. "బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని, ఏలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తంబ్ నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ద అబద్దాలను చూపిస్తున్నాయి. గుడ్డి వ్యతిరేకత వలనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తున్నాయి. ఇది వ్యక్తిగతంగా నాతోపాటు, మా పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతున్నదని భావిస్తున్నాము. కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా భావిస్తున్నాం. 

గతంలో మాపై అసత్య ప్రచారాలను, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించాము. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాము. అసత్యాలను అదేపనిగా ప్రచారం చేసి, అడ్డమైన తంబునెల్స్ తో వార్తల పేరిట ప్రాపగండకు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానళ్లపైన పరువు నష్టం కేసులు నమోదు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాము. దీంతోపాటు ఆయా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించాలని యూట్యూబ్ కి అధికారికంగా ఫిర్యాదు కూడా చేస్తాము. 

ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే, కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్దంగా ఉండాలని  హెచ్చరిస్తున్నాం" అని అన్నారు.