
- గ్యారంటీలు అమలు చేసేదాకా ఓపిక లేదా?
- కార్ రేసింగ్ కోసం ఫోన్లోనే రూ.200 కోట్లు ఇచ్చేసినవ్
- నీ తాత జాగీర్ అనుకుంటున్నవా?
- తెలంగాణ బిడ్డల సొమ్ము ఎట్ల ఇస్తవ్ అని ఫైర్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి రెండు నెలలైనా కాలేదని, ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో పక్కా అమలు చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. కేటీఆర్కు కొంచెం కూడా ఓపిక లేకపోతే ఎలా అని మండిపడ్డారు. రాత్రికి రాత్రే హామీలు అమలు చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. ‘‘కేటీఆర్ ఓ 420 అని అందరికీ తెలుసు. అలాంటిది.. కాంగ్రెస్ హామీలు 420 అని అనడం హాస్యాస్పదంగా ఉంది. ఆకాశం మీద ఉమ్మేస్తే అది మన మీదే పడతదనేది కేటీఆర్ గుర్తుంచుకోవాలి’’అని షబ్బీర్ అలీ చురకలంటించారు.
మూడేండ్లకే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందన్నారు. నష్టాన్ని వాళ్ల నుంచే భర్తీ చేయించాలని చెప్పారు. ‘‘టెలిఫోనింగ్ ఆర్డర్ అట.. హైదరాబాద్లో ‘ఫార్ములా ఈ’ కార్ రేసింగ్ కోసం కంపెనీలకు రూ.200 కోట్లు ఇచ్చేసిండు. ఇది మీ తాత జాగీరా? తెలంగాణ బిడ్డల సొమ్మును ఎట్ల ఇస్తవ్? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నీ వ్యవహారం ఉంది. అమెరికా నుంచి వచ్చిన నువ్వు.. డబ్బులు పంచేసినవ్. మేము 420 అంటే ప్రజలు ఎట్ల నమ్ముతరు? నువ్వే ఓ 420’’అని కేటీఆర్పై షబ్బీర్ అలీ మండిపడ్డారు. బుధవారం ఆయన గాంధీభవన్లో పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల చైర్మన్లతో సమావేశం అయ్యారు. బడ్జెట్ అంశాలపై చర్చించారు. తర్వాత షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అన్నింటిపై ప్రభుత్వం విచారణ జరిపించి బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టి లోపలికి వేయాలని సూచించారు.
ఫామ్హౌస్లు ఎట్ల వచ్చినయ్?
‘‘ఒకప్పుడు కేటీఆర్కు సిటీలో ఒక్క ఫ్లాట్ కూడా లేదు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో చాలా చోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నడు. హైటెక్ సిటీలాంటి ఏరియాల్లో ఆస్తులు ఎట్ల వచ్చినయ్? ఫామ్హౌస్లు ఎట్ల కట్టుకున్నడు? కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించిండు. ఏ స్కీమ్ను సక్కగా అమలు చేయలేదు’’అని షబ్బీర్ అలీ మండిపడ్డారు. బడ్జెట్లో కేటాయించిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చు కాకుంటే.. వాటిని కొత్త బడ్జెట్లో క్యారీ ఫార్వర్డ్ చేయాల్సి ఉన్నా.. బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా సరిగ్గా ఇవ్వలేదన్నారు. దీంతో చాలా మంది స్టూడెంట్స్ చదువుకు దూరం అయ్యారని తెలిపారు. పేద విద్యార్థులకు మేలు చేసేలా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయడంపైనా కసరత్తు చేస్తున్నామన్నారు.
షబ్బీర్ అలీనే ఇప్పుడు మాకు మంత్రి: బెల్లయ్య నాయక్
గతంలో మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు వచ్చాయంటే దానికి షబ్బీర్ అలీ పోరాటమే కారణమని కాంగ్రెస్ ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్కు ప్రస్తుతం మంత్రి లేరని, వాటికి సంబంధించినంత వరకు ఇప్పుడు తమకు షబ్బీర్ అలీనే మంత్రి అని చెప్పారు. సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్ అన్యాయం చేశారని ఓబీసీ సెల్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ అన్నారు.
హామీలు అన్నీ అమలు చేస్తాం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని షబ్బీర్ అలీ అన్నారు. గ్యారంటీలు, హామీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ డిక్లరేషన్లలోని అంశాలనూ అమలు చేస్తామని స్పష్టం చేశారు. అందుకు కావాల్సిన బడ్జెట్పై గురువారం డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్కతో కలిసి రివ్యూ చేస్తామని చెప్పారు. పార్టీ ఇచ్చిన గ్యారంటీలు, డిక్లరేషన్లు, హామీలను అధికారులు బడ్జెట్లో పెడ్తున్నారో.. లేదో.. చర్చిస్తామన్నారు. కాగా, గతంలో ఇందిరా గాంధీ ఇచ్చిన భూములను గత సర్కార్ గుంజుకున్నదని, వాటిపై దళితులకు మళ్లీ హక్కులు కల్పించాలని షబ్బీర్ అలీని కోరినట్టు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్ అన్నారు.