డబ్బా ఇండ్లు కట్టొద్దు .. డిజైన్లు ఇంటర్నేషనల్​ స్థాయిలో ఉండాలి : కేటీఆర్

 డబ్బా ఇండ్లు కట్టొద్దు .. డిజైన్లు ఇంటర్నేషనల్​ స్థాయిలో ఉండాలి : కేటీఆర్
  • అఫర్డబిలిటీ ట్యాగ్​ పోవొద్దు
  • సౌత్​, ఈస్ట్​ప్రాంతాలపై ఫోకస్​ చేయాలి
  • రియల్టర్లకు మంత్రి కేటీఆర్ ​సూచన

హైదరాబాద్​, వెలుగు: రియల్ ఎస్టేట్ రంగం నగరానికి కీలకమని,   డెవెలపర్లు డబ్బాల వంటి ఇండ్లు కాకుండా,  ఇంటర్నేషనల్​స్థాయిలో,  వినూత్న డిజైన్లతో భవనాలను నిర్మించాలని రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్,  పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్​రియల్​ ఎస్టేట్​ కంపెనీలకు సూచించారు.  ప్రస్తుతం దేశంలోనే ఇండ్ల ధరలు తక్కువగా ఉన్న నగరాల్లో  హైదరాబాద్‌‌ ఒకటని,  నగరానికి ఉన్న ‘అఫర్డబిలిటీ’ ట్యాగ్​పోకుండా చూడాలని సూచించారు.  సిటీలో ఇప్పుడు ఉన్న ధరలను చూస్తే భయమేస్తోందని అన్నారు. 

హైదరాబాద్​లో హైటెక్స్‌‌లో జరిగిన టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్‌‌పో రెండు రోజుల 3వ ఎడిషన్‌‌ను ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కేవలం గచ్చిబౌలి, హైటెక్​సిటీ వంటి ఖరీదైన ప్రాంతాలేగాక నగరం  వెలుపల ఉన్న వివిధ ప్రాంతాలలో అవకాశాలను చూడాలని రియల్ ఎస్టేట్ సంస్థలను  కోరారు.  మిగతా ప్రాంతాల్లోనూ ప్రభుత్వం ఇన్​ఫ్రాను అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. సౌత్​, ఈస్ట్​ ప్రాంతాల్లోనూ రియల్టీపై ఫోకస్​ చేయాలని మంత్రి కేటీఆర్​ సూచించారు. హైదరాబాద్​ అభివృద్ధికి మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులే కారణమని చెప్పారు. ‘‘ఒకప్పుడు కరెంటు కోతలు విపరీతంగా ఉండేవి. మంచి నీళ్ల కోసం కొడవలు జరిగేవి. కర్ఫ్యూలూ ఉండేవి.

 ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరెంటు కొరతను తీర్చాం. నీటి సరఫరా సమస్యలు పరిష్కారమయ్యాయి. శాంతిభద్రతలు చాలా బాగున్నాయి. ఎక్కడో ఉన్న నదుల నుంచి నీటిని తీసుకురావడం వల్ల నీటి బాధలు తగ్గాయి. హైదరాబాద్‌‌లో ఇప్పుడు నిరంతరాయంగా 24 గంటల కరెంటు సరఫరా జరుగుతోంది. నగర జనాభా పెరుగుతున్నా 2050 వరకు తాగునీటికి ఇబ్బందులు ఉండవు”అని వివరించారు.