విచారణ కాదు..ప్రతీకారం.. కేసీఆర్ కు సిట్ నోటీసులపై కేటీఆర్ కామెంట్

విచారణ కాదు..ప్రతీకారం.. కేసీఆర్ కు సిట్ నోటీసులపై  కేటీఆర్ కామెంట్
  •     నోటీసులు, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: కేవలం ప్రతీకారం కోసమే కేసీఆర్​కు సిట్​నోటీసులు ఇచ్చారని, రాజకీయ దురుద్దేశంతోనే పంపారని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ మండిపడ్డారు. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్న సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహనీయుడు కేసీఆర్ అన్నారు. సాధించిన తెలంగాణను పదేండ్ల తన పాలనతో ప్రపంచానికి చాటిచెప్పిన నాయకుడని పేర్కొన్నారు. 

కేసీఆర్​కు సిట్​ నోటీసుల నేపథ్యంలో గురువారం ఆయన స్పందించారు. ‘‘ఇది విచారణ కాదు.. ప్రతీకారం. ఇది న్యాయం కాదు.. రాజకీయ దురుద్దేశం. సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని, రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకుంటూ సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప విజనరీ కేసీఆర్. అడ్డగోలు హామీలు ఇచ్చి, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం.. అలాంటి నాయకుడికి నోటీసులిచ్చింది. 

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి, ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్​ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ఇప్పుడు విచారణల పేరుతో కేసీఆర్​కు నోటీసులివ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం. 

కేసీఆర్  తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు. నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. బీఆర్​ఎస్​ పార్టీ ఈ కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తాం. తెలంగాణ చరిత్రను విచారణలతో కాదు.. ప్రజల తీర్పుతోనే రాస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు.