నా ఫోన్ ఎందుకు ఇవ్వాలి? కారణాలు చెప్పకుండా ఎలా ఇమ్మంటరు?.. ఏసీబీకి రాసిన లేఖలో ప్రశ్నించిన కేటీఆర్

నా ఫోన్ ఎందుకు ఇవ్వాలి? కారణాలు చెప్పకుండా ఎలా ఇమ్మంటరు?.. ఏసీబీకి రాసిన లేఖలో ప్రశ్నించిన కేటీఆర్
  • 2021 నవంబర్​లో వాడిన ఫోన్ నా దగ్గర లేదు
  • 2024లోనే ఆ ఫోన్ మార్చేశానని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: పర్సనల్ ఫోన్, ల్యాప్​టాప్ ఎందుకు ఇవ్వాలని ఏసీబీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సరైన కారణం చెప్పకుండా తన ఎలక్ట్రానిక్ వస్తువులు సమర్పించాలని ఎలా అడుగుతారని పేర్కొన్నారు. 2021, నవంబర్ 1 నుంచి 2023, డిసెంబర్ 1 వరకు వాడిన సెల్​ఫోన్, ల్యాప్​టాప్, ట్యాబ్, ఐప్యాడ్ సమర్పించాలంటూ కేటీఆర్​కు సోమవారం ఏసీబీ నోటీసులు పంపింది. దీనిపై కేటీఆర్.. ఏసీబీకి బుధవారం లేఖ రాశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని, విచారణకు హాజరయ్యానని తెలిపారు. ‘‘విచారణ పూర్తయ్యాక బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 94 ప్రకారం నాకు ఏసీబీ అధికారులు మరో నోటీసు ఇచ్చారు.

నేను వాడిన ఫోన్, ల్యాప్​టాప్, ట్యాబ్, ఐపాడ్ ఇవ్వాలని ఆదేశించారు. నా పర్సనల్ థింగ్స్ ఎందుకు సమర్పించాలనే కారణంగానీ.. ఉద్దేశం గానీ.. ఎక్కడా చెప్పలేదు. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణకు సంబంధించిన అన్నిరకాల అధికారిక సంప్రదింపుల రికార్డులన్నీ పురపాలక శాఖ వద్దే ఉన్నాయి. అవన్నీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి హోదాలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలే. ఫిర్యాదులో నాపై చేసిన ఆరోపణల్లో గతంలో వాడిన ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రస్తావన కానీ, సంబంధం కానీ లేనప్పటికీ, వాటిని సమర్పించాలని కోరడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. అప్పుడు వాడిన ఫోన్ తన వద్ద లేదని చెప్పారు. 

హైడ్రాతో బ్లాక్​మెయిల్ దందాలు

హైడ్రాను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లీడర్లు బ్లాక్​మెయిల్ దందాలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్​తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ లీడర్లు అక్రమంగా కట్టిన ఏ ఒక్క ఇంటి జోలికి వెళ్లే సాహసం హైడ్రా చేయలేదన్నారు. పేదల ఇండ్ల మీద మాత్రం ప్రతాపం చూపిస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ బోరబండ డివిజన్​ మైనారిటీ నాయకుడు మహ్మద్ సర్దార్ ఫ్యామిలీని బుధవారం పరామర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వేధింపులతోనే సర్దార్ ఆత్మహత్య చేసుకున్నారు. యూపీలో బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నదని గొంతుచించుకుంటున్న రాహుల్ గాంధీకి, తెలంగాణలో రేవంత్ చేస్తున్న అరాచకాలు కనిపించడం లేవా? ఆటో కూడా వెళ్లలేని గల్లీల్లో ఉంటున్న గరీబోళ్ల మీద హైడ్రా, జీహెచ్​ఎంసీని అడ్డంపెట్టుకుని రేవంత్ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తున్నదని మండిపడ్డారు.

సుప్రీం కోర్టు నిబంధనలు పాటించాల్సిందే.. 

2024, ఫస్ట్ క్వార్టర్​లోనే ఫోన్ మార్చానని కేటీఆర్ వివరించారు. ఫోన్ కాకుండా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులేవీ తాను వాడలేదని తెలిపారు. విచారణలో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకోవాల్సి వస్తే.. సుప్రీం కోర్టు నియమనిబంధనలను పాటించాల్సిందేనని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని తీసుకుంటే.. ఆ పరికరాలను విచారణ సంస్థల అధికారులు ట్యాంపర్ చేయకుండా సుప్రీంకోర్టు విధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

 వ్యక్తిగత గోప్యతతో పాటు విచారణ పేరుతో ఒక పౌరుడి నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు ఎందుకు తీసుకుంటున్నారో సరైన కారణం చెప్పకుండా.. సేకరించిన సమాచారాన్ని ఆయనకే వ్యతిరేకంగా వాడడం సరికాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడిందన్నారు.