
హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఒకసారి కేటీఆర్ను విచారించిన ఏసీబీ.. 2025, మే 28న మరోసారి విచారణకు రావాలని సోమవారం (మే 26) సమన్లు పంపింది. ఈ క్రమంలో ఏసీబీ నోటీసులపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కేటీఆర్ స్పందించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చిందని తెలిపారు.
ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగమైనప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఖచ్చితంగా ఏజెన్సీలతో విచారణకు సహకరిస్తానని పేర్కొన్నారు. అయితే.. ఇప్పటికే తన విదేశీ షెడ్యూల్ ఖరారు అయ్యిందని.. యూకే, యూఎస్లో జరిగే కొన్ని కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉందని.. విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చాక ఏసీబీ విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.
ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులకు లిఖితపూర్వంగా తెలియజేశానని పేర్కొన్నారు. ఏ విధంగానైనా రాజకీయ ప్రతీకార దాహాం తీర్చుకోవడానికి ఎలాంటి సంకోశం లేకుండా ముందుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డిని అభినందించాలని ఎద్దేవా చేశారు. 48 గంటల క్రితం నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరును ఈడీ చార్జ్షీట్లో ప్రస్తావించింది.
ఇది జరిగిన 24 గంటల్లోనే ప్రధాని మోడీ సహా బీజేపీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి ఫొటోలు దిగుతూ దర్శనమిచ్చారని పేర్కొన్నారు. మనీలాండరింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు తెరపైకి వచ్చిన ఒక్క బీజేపీ నాయకుడి నుండి కూడా అతడికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్ అంటే సీఎం రేవంత్కు భయమని.. అందుకే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.