- రేవంత్ది రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేని కోవర్టు బతుకు: కేటీఆర్
- కాంగ్రెస్ను ప్రజలు వందేండ్ల దాకా పుట్టగతులు లేకుండా పాతిపెడ్తరు
- అసెంబ్లీ, ప్రజా వేదికల్లో కాంగ్రెస్ జలద్రోహాన్ని ఎండగడ్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ చేస్తున్న జలద్రోహంపై కేసీఆర్ ప్రశ్నిస్తే.. దానికి జవాబు చెప్పలేక సీఎం రేవంత్రెడ్డి నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ సోయి లేని, రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్టు బతుకు రేవంత్రెడ్డిది అని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సందర్భం వచ్చినప్పుడు తొక్కి నారతీస్తారని వార్నింగ్ ఇచ్చారు. 2028లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను బొందపెట్టడం ఖాయమని, మళ్లీ వందేండ్లదాకా పుట్టగతులు లేకుండా పాతిపెడతారని అన్నారు.
కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బుధవారం కేటీఆర్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా.. పెద్ద నోరేసుకుని అహంకారంతో అరుస్తున్నవా? పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి.. సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక దగుల్బాజీ కూతలు కూస్తున్నవా? అడ్డంగా దొరికిపోవడం..ఆగమాగం కావడం..అడ్డదిడ్డంగా వాగడం నీకు అలవాటే కదా. నీటి హక్కులపై రాజీపడ్డ నీ నిర్వాకాన్ని బయటపెడితే తట్టుకోలేక.. చిల్లర డైలాగులతో చిందులు తొక్కుతున్నవు. విధ్వంసక పాలనతో ప్రజలను చావ గొడుతున్నవు. వికృత మనస్తత్వంతో చావులు కోరుతున్నవు.
సభ్యత, సంస్కారంలేని నీచమైన నీ వాగుడును చూసి జనం చీదరించుకుంటున్నా ఇంకా మారవా? పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిపోయిన ఓటుకు నోటు దొంగవు నువ్వు.. అదే నీ స్థాయి’’ అని రేవంత్నుద్దేశించి వ్యాఖ్యానించారు. పనికిమాలిన శపథాలు చేయడం.. పత్తాలేకుండా పారిపోవడం రేవంత్కు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ, ప్రజా వేదికల్లో ప్రతిచోటా కాంగ్రెస్ జలద్రోహాన్ని ఎండగడతామని అన్నారు. తాము ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలం కాదని, రైతన్నల హక్కులకు భంగం కలిగితే భగ్గున మండుతామని చెప్పారు.
