రాహుల్​కు వండి, వడ్డించిన లాలూ

రాహుల్​కు వండి, వడ్డించిన లాలూ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీకి ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ ఢిల్లీలో విందు ఇచ్చారు. తానే స్వయంగా బీహార్ స్టైల్ లో మటన్ వండి వడ్డించారు. ఇందుకోసం మటన్, మసాలాలు బీహార్ నుంచే తెప్పించారు. పరువునష్టం కేసులో రాహుల్ కు శుక్రవారం సుప్రీంకోర్టులో ఊరట లభించగా, తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అదే రోజు రాత్రి రాహుల్ ను లాలూ డిన్నర్ కు ఆహ్వానించారు. 

ఢిల్లీలోని తన కూతురు, ఆర్జేడీ ఎంపీ మీసా భారతి ఇంటికి ఆయనను పిలిచారు. రాహుల్ అక్కడికి రాగానే లాలూ పుష్పగుచ్ఛంతో ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయనను ఆప్యాయంగా హత్తుకుని ఇంట్లోకి తీసుకుని వెళ్లారు. తానే స్వయంగా వండిన బీహార్ మటన్​ను రాహుల్​కు రుచి చూపించారు. ఈ విందులో లాలూ కొడుకు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా పాల్గొన్నారు. 

భోజనం చేస్తూ రాహుల్, లాలూ సరదాగా మాట్లాడుకున్నారని ఆర్జేడీ వర్గాలు తెలిపాయి. లాలూ ఆరోగ్యంపై రాహుల్ ఆరా తీశారని పేర్కొన్నాయి. రాజకీయ అంశాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగిందని చెప్పాయి. కాగా, ఇటీవల ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ‘ఇండియా’ కూటమిలో ఆర్జేడీ కూడా ఉంది.